హైదరాబాద్ లో రూ.కోటి విలువైన డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాద్ లో రూ.కోటి విలువైన డ్రగ్స్ స్వాధీనం

ఎల్బీనగర్, వెలుగు: రాజస్థాన్ నుంచి నగరానికి డ్రగ్స్​ తీసుకువచ్చి విక్రయించే ప్రయత్నం చేసిన వ్యక్తిని మల్కాజిగిరి ఎస్ఓటీ, కీసర పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ లోని రాచకొండ సీపీ క్యాంప్ ఆఫీసులో సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్​కు చెందిన లోకేశ్​ బరేత్జ్(26) తన మిత్రుడు జగదీశ్​గుజ్జర్ కలిసి హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాలకు ఓపీఎం డ్రగ్స్ ను సప్లయ్​ చేయాలని ప్లాన్ చేశాడు. 

ఆగస్టులో జగదీశ్​గుజ్జర్ ఆదేశాలతో లోకేశ్​ బరేత్ రాజస్థాన్ నుండి రైలులో హైదరాబాద్ కు వచ్చి కాచిగూడ రైల్యే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తికి 2 కిలోల నల్లమందు అందజేసి వెళ్లాడు. మరోసారి శుక్రవారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కుండన్ పల్లి ఓఆర్ఆర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తికి డ్రగ్స్ ను అప్పగించేందుకు వేచి ఉండగా మల్కాజిగిరి ఎస్వోటీ, కీసర పోలీసులు లోకేశ్​బరేత్జ్ ను శుక్రవారం అరెస్టు చేశారు. 

రూ.కోటి  విలువైన ఓపీఎం డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న జగదీశ్​ గుజ్జర్​ను  త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. సమావేశంలో మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి, భువనగిరి ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ ఎస్​జీటీ అంజయ్య పాల్గొన్నారు.