వరంగల్ రేంజ్ ఎస్ఐలకు అన్యాయం
డీఎస్పీ పోస్టు కోసం 55 మంది, సీఐ పోస్టుకు 18 మంది వెయిటింగ్
ఎస్ఐ పోస్టింగ్ కోసం ఏఎస్ఐల ఎదురుచూపు
కొందరు ఏఎస్ఐలకే ప్రమోషన్
ఎస్ఐలుగా ప్రమోషన్ కోసం హైదరాబాద్, వరంగల్ రేంజ్లో 304 మందిని సెలెక్ట్ చేశారు. ఇందులో ఆరుగురు ఉమెన్ హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు. వీళ్లంతా హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు పదోన్నతులు పొందినవారే. అంబర్ పేట్ సీపీఎల్లో వీరు 3 నెలల ట్రైనింగ్ తీసుకున్నారు. సీనియార్టీ ప్రకారం ఎస్ఐ ప్రమోషన్ కోసం చూస్తున్నారు. అయితే ప్రస్తుతం120 ఎస్ఐ పోస్టులే ఖాళీగా ఉన్నట్టు తెలిసింది. తాజాగా బుధవారం హైదరాబాద్ రేంజ్లో 98 మందికి ప్రమోషన్లు కల్పించగా, మిగతావారు 206 మంది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు: పోలీస్ శాఖలో ప్రమోషన్ల కోసం కొందరు కిందిస్థాయి అధికారులు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. తమ బ్యాచ్ ఆఫీసర్లకు ప్రమోషన్ వచ్చి.. తమకు రాకపోవడంతో పలువురు సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రేంజ్తో పోలిస్తే వరంగల్ రేంజ్ ఎస్ఐలకు ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందనే విమర్శలు కొన్నాళ్లుగా విన్పిస్తోంది. క్లరికల్ మిస్టేక్తో 60కి పైగా సీఐ ఖాళీలను వరంగల్ రేంజ్ నుంచి తొలగించారు. ఫలితంగా ఖాళీలు తగ్గి ఒకే బ్యాచ్కు చెందిన ఎస్ఐలు అయినప్పటికీ హైదరాబాద్ రేంజ్ ఎస్ఐలు ముందుగా ప్రమోషన్ పొందుతున్నారు. దీంతో వరంగల్ రేంజ్ ఎస్ఐలు సీనియార్టీలో వెనకబడుతున్నారు. అంతేకాకుండా డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చేటప్పుడు 30 శాతం పోస్టులను ర్యాంకర్లతో, 70 శాతం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ ఎస్ఐలతో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ రేషియోను వరంగల్ రేంజ్ మాత్రమే ఫాలో అయిందని, ఇతర రేంజ్ అధికారులు ఫాలో కావడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ కారణాలతోనే హైదరాబాద్ రేంజ్లోని 95, 96 బ్యాచ్ ఎస్ఐలు 2017 నవంబర్లోనే డీఎస్పీలుగా ప్రమోషన్ పొందగా, వరంగల్ రేంజ్కు చెందిన 95 బ్యాచ్ ఎస్ఐల్లో కొందరికే ప్రమోషన్ వచ్చింది. మరో 55 మంది ప్రమోషన్కు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు.
వరంగల్ రేంజ్లో 18 మంది
2017–18లో ఎస్ఐలకు సీఐలుగా ప్రమోషన్ ఇచ్చేందుకు 2017 డిసెంబర్లో సమావేశమైన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ హైదరాబాద్ రేంజ్లో 248 ఖాళీలను, వరంగల్ రేంజ్లో 162 ఖాళీలను గుర్తించి అప్రూవల్ ఇచ్చింది. హైదరాబాద్ రేంజ్లో ఖాళీలను పూర్తిగా భర్తీ చేయగా, వరంగల్ రేంజ్లో 152 మందితోపాటు అప్రూవల్ కాని వేరే పది మంది ఎస్ఐలకు పోస్టింగ్స్ ఇచ్చారు. ఫలితంగా పది మంది ఎస్ఐలు నష్టపోగా, అర్హులైన మరో 8 మంది ఎస్ఐలు సీఐ ప్రమోషన్ కోసం చూస్తున్నారు. ఉన్నతాధికారులను ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోకపోవడంతో వారు హైకోర్టుకు వెళ్లారు.