- స్టేడియం, ఫలక్నుమా ప్యాలెస్ చుట్టూ మూడంచెల భద్రత
- బందోబస్తులో 3,800 మంది పోలీసులు, కేంద్ర బలగాలు
- శంషాబాద్ నుంచి ఉప్పల్ స్టేడియం దాకా గ్రీన్చానెల్
- 20 వాహనాల కాన్వాయ్లో మెస్సీ, రాహుల్, రేవంత్
హైదరాబాద్, వెలుగు: ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఫలక్నుమా ప్యాలెస్ వద్ద మూడంచెల భద్రత కల్పించారు. ఉప్పల్ స్టేడియం, పరిసర ప్రాంతాలను సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.
రాచకొండ సీపీ సుధీర్ బాబు సహాబందోబస్తులో ఉన్న అధికారులకు డీజీపీ పలు సూచ నలు చేశారు. మొత్తం 3,800 మంది పోలీసులను మోహరించారు. ఫ్యాన్స్ స్టేడియంలోకి దూసుకురాకుండా నివారించేందుకు 20 రోప్ పార్టీ బృందాలను ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి చాంద్రయణగుట్టలోని ఫలక్నుమా ప్యాలెస్కు, అక్క డి నుంచి ఉప్పల్ స్టేడియంకు చేరుకునే సమయంలో రోడ్డుకు ఇరువైపులా పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లో 20కి పైగా వాహనాలతో గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. అభిమానులు గ్రౌండ్ లోకి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. మెస్సీకి జడ్ కేటగిరీ భద్రత కల్పించారు. దీనితోపాటు సీఆర్పీఎఫ్, కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహించారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు డ్రోన్ల ద్వారా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
