సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏరియాల వారీగా...

సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏరియాల వారీగా...

వినాయక నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా రేపు హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇవాళ అర్థరాత్రి నుంచే సిటీలోకి లారీలను అనుమతించబోమని పోలీసులు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులను కూడా కొన్నిచోట్ల దారి మళ్లిస్తున్నట్టు తెలిపారు. ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లకు వెళ్లేవారు ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవాలని సూచించారు. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పోలీసులు. గూగుల్ మ్యాప్స్ లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేలా ఏర్పాటు చేశారు.

ఫలక్ నుమా నుంచి వచ్చే శోభాయాత్ర చార్మినార్, అఫ్జల్గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్ చేరుకునేలా ఏర్పాటు చేశారు. అలాగే బేగం బజార్, ఉస్మాన్ గంజ్, అఫ్జల్గంజ్  గౌలిగూడా మీదుగా శోభాయాత్రకు వెళ్లే విధంగా సెట్ చేశారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీ రోడ్, కర్బల మైదానం, కవాడిగూడ, ముషీరాబాద్ సర్కిల్, హిమయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లిస్తారు. ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా వచ్చేలా సెట్ చేశారు. టోలిచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లిస్తారు. ఎర్రగడ్డ, SR నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్కు చేరుకోనుంది. విగ్రహాలను తరలించే వాహనాలకు కలర్ కోడింగ్ ఇచ్చారు. బ్లూ, ఆరెంజ్, రెడ్, గ్రీన్ కలర్ ఆధారంగా రూట్ మ్యాప్ రెడీ చేశారు ట్రాఫిక్ పోలీసులు.