హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో దేశ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈ కర్ఫ్యూతో దేశమంతా మూగబోయింది. సిటీలు, గ్రామాలు అనే తేడా లేకుండా వీధులన్నీ బోసి పోయాయి. కానీ హైదరాబాద్ లో కొందరు తమకేం పట్టదన్నట్లు బైకులపై తిరుగుతున్నారు. అలాంటి వారికి పోలీసులు గాంధేయ మార్గంలో రిక్వెస్ట్ చేస్తున్నారు. 14 గంటలు ఓపిక పడితే కరోనా గొలుసును అరికట్టవచ్చని దండంపెట్టి చెబుతున్నారు.
కొన్ని చోట్ల పోలీసులు ప్లకార్డులు పట్టుకుని తమ సంఘీభావాన్ని తెలిపారు. మీకోసం మేం పనిచేస్తున్నాం, మీరు ఇండ్లల్లోనే ఉండండి అన్న ప్లకార్డులను పోలీసులు ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పోలీసులు చేసిన మంచి పనికి ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ జనతా కర్ఫ్యూలో.. పోలీసులు, జర్నలిస్టులు, డాక్టర్లు, ఫైర్ సిబ్బందిని మినహాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశానికి వీరు చేస్తున్న సేవలకు గానూ సాయంత్రం 5 గంటలకు ప్రజలందరూ చప్పట్లు కొట్టి అభినందించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.