మద్నూర్ లో 13 లక్షల బంగారం  రికవరీ

 మద్నూర్ లో 13 లక్షల బంగారం  రికవరీ

బాన్సువాడ, వెలుగు: మద్నూర్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితున్ని అరెస్టు చేసి, సొమ్ము రికవరీ చేసినట్టు డీఎస్పీ సత్యనారాయణ చెప్పారు. గురువారం ఆయన బాన్సువాడలో వివరాలను వెల్లడించారు. ఈనెల 26న రాత్రి 8 గంటలకు మద్నూర్ లో మహాజన్ బాలాజీ ఇంటి తాళం పగులగొట్టి బీరువా లో ఉన్న 15 తులాల బంగారు నగలు, 10 తులాల బంగారు బిస్కెట్, రూ. 16వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాలాజీ మద్నూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 27న సాయంత్రం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా మద్నూర్ చెందిన ఉప్పరివార్ శ్రీను (32) అనుమానాస్పదంగా కనిపించగా అతన్ని పట్టుకొని విచారించారు.

మద్యానికి అలవాటు పడిన శ్రీను కొంతకాలంగా దొంగతనాలు చేస్తున్నట్టు తెలిసింది. వారం రోజుల నుంచి బాలాజీ ఇంటి వద్ద రెక్కి చేసి, అతడు బయటకు వెళ్లిన సమయంలో దొంగతనం చేసినట్టు అంగీకరించాడు. 3 నెలల కింద బాగన్న మఠం దగ్గర కూడా దొంగతనం చేశాడని డీఎస్పీ చెప్పారు. అతని నుంచి 10 తులాల బంగారం బిస్కెట్, 15 తులాల నగలు, రూ. 16 వేల నగదు సీజ్ చేశారు. దీని విలువ రూ.13లక్షల 31వేలు ఉంటుందన్నారు. కేసును పరిష్కరించిన బిచ్కుంద సీఐ నరేశ్​, ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది సాయిబాబా గౌడ్, సాయిలు ను అభినందించారు.