మిర్యాలగూడ కాంగ్రెస్ లో రచ్చ కెక్కిన విభేదాలు...!

మిర్యాలగూడ కాంగ్రెస్ లో రచ్చ కెక్కిన విభేదాలు...!
  • కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇరువర్గాల ఘర్షణ
  • వన్ టౌన్ పీ ఎస్ లో పరస్పరం ఫిర్యాదు

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో విబేధాలు బయటపడ్డాయి. పార్టీ కార్యాలయంలోనే డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్... మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల అనుచరులు పరస్పరం దాడి చేసుకున్నారు. అనంతరం వన్ టౌన్ పిఎస్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

ఎల్ఐసీ  ప్రైవేటీకరణను నిరసిస్తూ డీసీసీ అధ్యక్షుడు సహా పలువురు స్థానిక ఎల్ఐసీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అయితే ధర్నా గురించి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించారంటూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయుల డీసీసీ సహా ఆయన అనుచరులను నిలదీశారు. ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం అనంతరం ఇరు వర్గాలు  పార్టీ ఆఫీసు కు  చేరుకున్నాయి. ఈ తరుణంలో హాత్ సే హాత్ జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరణకు రాబోమని  మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ ఆఫీసులో  మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ లు చెప్పారు. ఇదే క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడం ఘర్షణకు దారితీసింది. ఇన్నాళ్లు అంతర్గతంగా సాగుతున్న వర్గ పోరు ఎల్ఐసీ ప్రైవేటీకరణపై పట్టిన ధర్నా వేదికగా బహిర్గతమైంది.