
- హెచ్సీఏలో మళ్లీ ‘పొలిటికల్ గేమ్’
- శివలాల్, అర్షద్ ఆధ్వర్యంలో ఎస్జీఏం
- అపెక్స్ కౌన్సిల్లో మెంబర్ల సంఖ్య పెంచాలని తీర్మానం చేసినట్టు వెల్లడి
- ఈ నిర్ణయాలు చెల్లవని అజర్ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: కొన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో మళ్లీ అలజడి మొదలైంది. గ్రూపు రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయుబ్, సెక్రటరీ శేష్ నారాయణ్ అధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్లోని ఓ హోటల్లో స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్లో మెంబర్ల సంఖ్యను 9 నుంచి 19కి పెంచుతూ తీర్మానం చేసిన్నట్టు మీటింగ్ తర్వాత ప్రకటించారు. దీనిపై సుప్రీంకోర్టు మూడేళ్ల కిందటే ఆదేశాలు ఇచ్చినా ప్రస్తుత పాలకులు పట్టించుకోలేదన్నారు. అయితే, ఆదివారం హెచ్సీఏ ఎలాంటి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయలేదని అధ్యక్షుడు అజరుద్దీన్ ప్రకటన చేశాడు. కొంత మంది హెచ్సీఏ మెంబర్లు ఏర్పాటు చేసిన సమావేశానికి చట్టబద్దత లేదని, అందులో చేసిన తీర్మానాలు చెల్లవని ప్రకటించాడు. లోధా సిఫారసుల అమలు తర్వాత హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను పెంచాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్టు తమకు తెలియన్నాడు.