ఎల్బీనగర్/వికారాబాద్/గండిపేట, వెలుగు: ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక కోరారు. గురువారం కొంగరకలాన్లోని రంగారెడ్డి కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా ఈ నెల 6న ఓటర్ డ్రాఫ్ట్ జాబితా ప్రచురితమైందని, క్లయిమ్స్, అభ్యంతరాలకు ఈ నెల 22 వరకు అవకాశముందని తెలిపారు. ఈ నెల 20, 21 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తామన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితాతో బీఎల్వోలు అందుబాటులో ఉంటారని తెలిపారు. జనవరి 1 నాటికి 18 ఏండ్లు పూర్తయిన వారందరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో సూచించారు. రాజేంద్రనగర్ పరిధిలో కొత్త ఓటరు నమోదు కోసం ఈ నెల 20, 21 తేదీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు బల్దియా రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవి కిరణ్ తెలిపారు.