అమ్మో.. మంచిర్యాలా.. ఇక్కడ పోస్టింగ్అంటేనే జంకుతున్న ఆఫీసర్లు

అమ్మో.. మంచిర్యాలా.. ఇక్కడ పోస్టింగ్అంటేనే జంకుతున్న ఆఫీసర్లు
  • అధికారులపై పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు
  • ఇల్లీగల్​దందాలు చేయాలంటూ ప్రెజర్
  • లీవ్​లో వెళ్లిన కార్పొరేషన్ కమిషనర్
  • ట్రాన్స్​ఫర్​కోసం మరికొందరి ప్రయత్నాలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలో రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుంటూ పనిచేయడం అధికారులకు సవాల్​గా మారింది. బడా లీడర్ల నుంచి చోటామోటా నాయకుల దాకా ఆఫీసర్లపై జులుం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చెప్పినట్టే వినాలని, అంతటా తమ మాటే నడవాలని ఒత్తిళ్లు వస్తున్నాయని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ రూల్స్ ​ప్రకారం పనిచేసే వెసులుబాటు లేకుండా పోయిందని అధికారులు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో మంచిర్యాలలో పని చేయడానికి ఆఫీసర్లు పోటీ పడేవారు. ఎక్కడెక్కడో పైరవీలు చేసుకొని పోస్టింగ్​తెచ్చుకునేవారు. ఆ తర్వాత ట్రాన్స్​ఫర్​ అయినా కదలకుండా ఇక్కడే ఉండటానికి తమ పరపతిని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంచిర్యాలలో పోస్టింగ్ అంటేనే చాలామంది జంకుతున్నారట. తెలిసో తెలియకో వచ్చినవాళ్లు ఇక్కడి నుంచి ఎప్పుడు బయటపడదామా అని చూస్తున్నారని టాక్​ వినిపిస్తోంది. 

ఆఫీసర్లపై పొలికటిల్​ ప్రెజర్

వివిధ డిపార్ట్​మెంట్లలో ప్రజాప్రతినిధులు, నాయకుల జోక్యం మితిమీరడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రేషన్​ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఔట్​సోర్సింగ్ ​జాబ్స్, టెండర్లు, కాంట్రాక్టులు ఇలా ప్రతీది తాము చెప్పినవాళ్లకే ఇవ్వాలని, లేదంటే కథ వేరే ఉంటుందని కొంతమంది లీడర్లు బాహాటంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్​ఆఫీసుల్లో, పోలీస్​స్టేషన్లలో ఏ పని కావాలన్నా లీడర్ల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లీడర్ల ప్రెజర్​వల్ల రూల్స్​కు వ్యతిరేకంగా పనులు చేస్తూ ప్రజల్లో పలుచనవుతున్నామని పలువురు ఆఫీసర్లు వాపోతున్నారు.

ఇల్లీగల్​ దందాలు, కేసులు చేయాలంటూ.. 

కొంతమంది లీడర్లు వారికి అనుకూలంగా ఇల్లీగల్​దందాలు చేయాలంటూ ఆఫీసర్లను బలవంతం చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. మంచిర్యాలలో ఇటీవల భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో లీడర్లంతా రియల్​ ఎస్టేట్​పై ఫోకస్ ​పెట్టారు. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాలకు పాల్పడుతున్నారు. పట్టా భూములతో పాటు గవర్నమెంట్, అసైన్డ్​ ల్యాండ్స్​ను దర్జాగా అమ్ముకుంటున్నారు. వివాదాస్పద భూముల్లో తలదూర్చి సెటిల్​మెంట్లు చేస్తున్నారు. 

 కొందరు అధికారులు బాధ్యత మరిచి వీరికి అనుకూలంగా వ్యవహరిస్తుండగా.. నిజాయితీగా పనిచేసేవారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాలలో దాడులు, కేసుల పరంపర నడుస్తోంది. ఎవరిపై కేసులు పెట్టాలో, ఏ సెక్షన్ల కింద నమోదు చేయాలో పోలీసులను లీడర్లే శాసిస్తున్నారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేస్తే ఆ తర్వాత ఇరుక్కుపోవాల్సి వస్తుందని భయపడుతున్న కొంతమంది ఆఫీసర్లు ట్రాన్స్​ఫర్ కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం.

లీవ్​లో వెళ్లిన కార్పొరేషన్​ కమిషనర్​

మంచిర్యాల మున్సిపల్ ​కార్పొరేషన్​ కమిషనర్​ టి.శివాజీ 15 రోజులు లీవ్ పెట్టి వెళ్లారు. ఆయన ఇక్కడినుంచి ట్రాన్స్​ఫర్ ​కోసం ట్రై చేస్తున్నారని, ఇక తిరిగి రాకపోవచ్చనే టాక్​ వినిపిస్తోంది. లీడర్ల ఒత్తిళ్లు తట్టుకోలేక, ఇల్లీగల్​ పనులు చేయడం ఇష్టం లేకనే శివాజీ లీవ్​లో వెళ్లారని పొలిటికల్, అఫీషియల్ ​సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. ఇటీవల నస్పూర్​లో జరిగిన ఓ మీటింగ్​లో అక్కడి లీడర్లు కమిషనర్​పై ఆరోపణలు చేయగా, వాళ్ల సమక్షంలోనే బడా లీడర్ మాటలు తూలడంతో ఆయన నొచ్చుకున్నారట. ‘నేను చెప్పినట్టు పనిచేసేవాళ్లే ఇక్కడ ఉంటరు’ అంటూ ఆ లీడర్​ వార్నింగ్​ఇవ్వడం అధికార వర్గాలను మరింత కలవరపెడుతోంది. ఈ క్రమంలో మంచిర్యాలకు వచ్చేందుకు ఆఫీసర్లు ఇంట్రెస్ట్​ చూపడం లేదని తెలుస్తోంది.