తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికల సంఘం ఓటు హక్కు వినియోగించుకునేవారికి అవకాశం ఇచ్చింది. అయితే అప్పటికే క్యూ లైన్లో ఉన్నవారికే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అధికారులు అనుమతి ఇచ్చారు. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. 

* ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగిసిన పోలింగ్
* ఆదిలాబాద్ , నిర్మల్ , బైంసా, ఖానాపూర్, అసిఫాబాద్, కాగజ్‌నగర్‌  మున్సిపాలిటీలలో ‌ముగిసిన పోలింగ్
* క్యూలైన్లో ఉన్నా ఓటర్లకు ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తున్న అధికారులు
* మహబూబ్‌నగర్ జిల్లాలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
* గేట్లకు తాళం వేసిన పోలీసులు. ఐదు గంటల వరకు వరుసలో ఉన్నవారికి  ఓటు వేసేందుకు అనుమతి.

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములపై ఆయా పార్టీల నేతలు  ఎవరి ధీమాలో వారున్నారు. ఆరు రోజులుగా జరిగిన ప్రచారం, ఆ తర్వాత చేపట్టిన పోల్​ మేనేజ్​మెంట్ను ఆధారం చేసుకొని  గెలుపు మాదంటే.. మాదేనని చెప్తున్నారు. కాంగ్రెస్​ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్​ రెడ్డి రంగంలోకి దిగి ఐదు బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తమకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.  రాష్ట్ర మంత్రులు తమకు కేటాయించిన పార్లమెంట్​స్థానం పరిధిలోని మున్సిపాలిటీల ఎన్నికల బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకొని పనిచేశారు. పీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​ గౌడ్, ఎమ్మెల్యేలు, సీనియర్లంతా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపారు.

బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్​ రెడ్డితో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే, బీజేపీ ఎంపీలంతా కూడా తమ నియోజకవర్గాల పరిధిలో పోటాపోటీగా క్యాంపెయినింగ్​ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్​ నబిన్​ రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడాన్ని బట్టి ఈ ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.​ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు సైతం రాష్ట్రమంతా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఇక బీఆర్​ఎస్ అధినేత కేసీఆర్ ​ఫాం హౌస్​కే పరిమితం కాగా, ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్​రావు పార్టీ భారాన్నంతా మోశారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఆ పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.