
భవనాలను చూసి మురిసిపోతుంటాము. తప్పులేదు. అయితే భవనాల గురించిన జ్ఞానం కూడా పెంచుకోవలసిన అవసరం ఉన్నది. చిన్న భవనాల నుంచి ఆకాశహర్మ్యాల వరకు ప్రపంచమంతటా నిర్మాణం అవుతున్నాయి. కూల్చడం కట్టడం ఒక నిరంతర ప్రక్రియగా, ఆధునిక జీవితంలో ఒక భాగంగా, అభివృద్ధికి సూచికగా మారిన తరుణంలో, భవనాలను గురించి అంతగా లోతుల్లోకి వెళ్లని పరిస్థితి అంతటా ఉన్నది. మన దేశం ఈ విషయంలో కొన్ని పాళ్ళు ఎక్కువ అనిపిస్తుంది.
పారిస్లో జరిగిన 21 వ ప్రపంచ వాతావరణ సదస్సు (COP21)లో, గ్లాస్గోలో జరిగిన 26 వ (COP26) సమావేశంలో, దాదాపు అన్ని దేశాలు పుడమి ఉష్ణోగ్రతను (గ్లోబల్ వార్మింగ్) 2 డిగ్రీC కంటే తక్కువకు, ఆదర్శంగా1.5డిగ్రీCకి పరిమితం చేయడం అవసరమని అంగీకరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి విపరీత వాతావరణ సంఘటనలు ఆ లక్ష్యాలను నిరంతరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తూనే ఉన్నాయి.
అన్ని రంగాలను లక్ష్యంగా పెట్టుకోవడం లేదు. అందులో ఒకటి భవన నిర్మాణరంగం. కాంక్రీట్, సిమెంట్ భవనాల నుంచి కర్బన ఉద్గారాలు విడుదల అవుతాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో నిరూపించారు. అయినా ఈ రంగంలో తీసుకోవాల్సిన మార్పుల గురించి కనీస ఆలోచన కూడా చేయడం లేదు. భారతదేశం ఇందుకు మినహాయింపు కాదు. 2025 ప్రారంభం నాటికి, ప్రపంచ శక్తి సంబంధిత COడిగ్రీ ఉద్గారాలలో గణనీయ శాతం భవనాలు, భవనాల నిర్మాణ రంగం, కర్బనం మిళితమైన నిర్మాణ సామగ్రి నుంచి ఉన్నది.
భవన రంగం నుంచి ఉద్గారాలు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ప్రపంచవ్యాప్తంగా 2022-–23 మధ్య భవనాల విస్తీర్ణంలో 5 బిలియన్ చదరపు మీటర్ల (రెండు శాతం)పెరుగుదలతో మొత్తం 260 బిలియన్ చదరపు మీటర్లకు పెరిగిందని అంచనా. కాలుష్యం పెరుగుదల భవనాల సంఖ్య పెరగడంతో పాటు నిర్మాణాలకు ఉపయోగిస్తున్న వస్తువులు, సామగ్రి, పదార్థాల వల్ల కూడా కాలుష్యం పెరుగుతున్నది. కేవలం కర్బన కాలుష్యమే కాకుండా ఇతర వాయువులు, భార లోహాలు, సూక్ష్మ ధూళికణాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఆధునిక మానవుడి ప్రకృతి విధ్వంసకర జీవితానికి భవనాలు కూడా ఒక ప్రతీకగా మారినాయి.
మహానగరాల్లోనే భవన శిథిలాలు ఎక్కువ
భవనాల నిర్మాణం దగ్గర నుంచి శిథిలావస్థలో కూడా పర్యావరణం మీద ప్రభుత్వం చూపుతున్నాయి. ప్రతి మహానగరంలో భవనాల శిథిలాలు, అసంపూర్ణంగా మిగిలిన భవనాల వల్ల పర్యావరణ దుష్ప్రభావాలుపెరుగుతున్నాయి. మహానగరపాలికలకు భవన శిథిలాలు ఒక పెద్ద తలనొప్పిగా మారినాయి. వాటిని ఎక్కడ పడేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నది.
ఇష్టారీతిన వీటిని చెరువులు, కుంటలు, కాలువలు పూడ్చటానికి వాడుతున్నారు. ఈ రకమైన వ్యర్ధాల వల్ల భూమి స్వరూపం, సాంద్రత దెబ్బతింటుంది. - ప్రపంచ వ్యర్థాలలో దాదాపు మూడింట ఒక వంతు భవన నిర్మాణ కూల్చివేత వ్యర్ధాలే. భారతదేశంలో గణనీయమైన స్థాయిలో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు తయారు అవుతున్నాయి. బిల్డింగ్ మెటీరియల్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రకారం భవనాల నిర్మాణాలు ఏటా 150 మిలియన్ టన్నుల వరకు ఉంటుందని అంచనా. వీటిని నిరంతరంగా పర్యవేక్షించే విభాగం కానీ పరిశోధన కానీ లేదు.
శిథిలాల రీసైక్లింగ్ తక్కువ
దేశం మొత్తం ఈ శిథిలాలను పునఃవినియోగించే (రీసైక్లింగ్) సామర్థ్యం కేవలం రోజుకు 6,500 టన్నులు మాత్రమే. మొత్తం ఉత్పన్నం అవుతున్న నిర్మాణ వ్యర్థాలలో ఇది కేవలం ఒకశాతం మాత్రమే. 2017 నాటికి 53 నగరాలు సి & డి వ్యర్థాల రీసైక్లింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా 2020 నాటికి కేవలం 13 నగరాలు మాత్రమే కొంత అడుగు ముందుకు వేశాయి. ఈ 13 నగరాలు కూడా పూర్తిగా పునఃవినియోగించడం లేదు. బహుశా ఈ కేంద్రాల సామర్థ్యం 5 శాతం కంటే ఎక్కువ ఉండకపోవచ్చు.
భవన నిర్మాణ వ్యర్ధాలలో కేవలం సిమెంట్, ఇటుకల వ్యర్ధాలే కాకుండా ప్లాస్టిక్, తదితర వ్యర్ధాలు కూడా ఉంటున్నాయి. వాటి పరిమాణం కూడా పెరుగుతున్నది. భవన నిర్మాణంలో ప్లాస్టిక్, సిమెంట్, స్టీల్, ఇనుము తదితర వస్తువులు ఉంటాయి. ఇందులో పెయింట్ లాంటివి ప్రమాదకరం. అవి శిథిలాల ద్వారా క్రమంగా సమీప నీటి వనరులలో చేరి కలుషితం చేస్తాయి. భవన శిథిలాల మీద పరిశోధన చాలా తక్కువ. అధ్యయనం పెరిగితే సమస్య తీవ్రత తెలుస్తుంది.
గ్రీన్ బిల్డింగ్స్ పెరుగుదల
హరిత భవనాలు (గ్రీన్ బిల్డింగ్) నిర్ధారణ కూడా పెరిగింది. అన్నీ దేశాలలో అంతటా ఈ పరిస్థితి లేదు. అభివృద్ధి చెందిన దేశాలలోని కొత్త వాణిజ్య భవనాలు 2020లో 15 శాతం నుంచి 2023లో 20 శాతం సర్టిఫికేషన్ సాధించాయి. శక్తి ఉపయోగం తగ్గించడానికి మెటీరియల్ పునర్వినియోగం, మాడ్యులర్ బిల్డింగ్ వంటి వృత్తాకార నిర్మాణ పద్ధతులు కూడా అవలంబిస్తున్నారు. యూరప్లో భవన నిర్మాణంలో పునఃవినియోగం (రీసైకిల్) పదార్థాలు 18 శాతం వాటా కలిగి ఉన్నాయి. అయితే భారత దేశంలో హరిత భవనాలు పెరగడం లేదు. వర్షపు నీటిని ఉపయోగించే వ్యవస్థలు, మురికి నీటిని శుద్ధి చేసే వసతులు, పునరుత్పాదక శక్తి ఉపయోగించడం వంటివి చేస్తే పర్యావరణ పరంగా మంచి ఫలితాలు వస్తాయి.
వనరుల వినియోగం ఎక్కువ
భవన నిర్మాణ మార్గదర్శకాలలో మార్పులు పెద్దగా జరగడం లేదు. భవనాలలో శక్తి ఉపయోగం తగ్గించే ప్రయత్నాలలో లోటు కనపడుతున్నది. బహుళ అంతస్తుల భవనాలలో నివసించే వారు లేదా అక్కడి వసతులు ఉపయోగించేవారు తప్పని సరిగా అధికంగా విద్యుత్ శక్తిని వాడాల్సి వస్తుంది. ప్రతిభవనంలోను సరి అయిన వెలుతురు లేక, పట్టపగలే విద్యుత్ దీపాలు వెలిగిస్తే కాని కనపడదు.
అట్లాగే, గాలి సరిగా లేక, కృత్రిమంగా ఫాన్లు లేక ఏసి యంత్రాలు పెట్టుకోక తప్పడం లేదు. నీటి వాడకం కూడా బహుళ అంతస్తుల భవనాలలో ఎక్కువ. మొత్తంగా, ప్రతి బహుళ అంతస్తు భవనం వలన, కట్టేటప్పుడు, దానిని వాడేటప్పుడు అధికంగా శక్తి, ఇంధన, నీటి అవసరము ఏర్పడుతుంది. వీటి ఉపయోగాన్ని తగ్గిస్తే పర్యావరణానికి మేలు కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో హరిత భవనాల ఆలోచన రూపు దిద్దుకుంది.
నీటి నిలువ, సౌరవిద్యుత్ అవసరం
ఒక దశాబ్ద కాలం నుంచి, భవనాల్లో అధిక సహజ గాలి, వెలుతురు ప్రసరించే విధంగా రూపురేఖలలో, డిజైన్ లో మార్పులు తీసుకువచ్చే ప్రక్రియ మొదలయ్యింది. భవనంలో వాడిన అన్ని రకాల నీళ్ళను మళ్ళీ వాడుకోవటానికి శుద్ధి వ్యవస్థ ఏర్పాటు కూడా ఉంటుంది. వర్షపు నీరు నిలువ చేసే వసతులు కూడా ఉంటాయి. విద్యుత్ శక్తికి సొంతంగా సౌర విద్యుత్ లేదా పవన విద్యుత్ ఉత్పత్తి ఏర్పాట్లు ఉంటాయి. ఇంకా పరికరాల ఉపయోగం, గోడలకు వేసే రంగులు కూడా పర్యావరణానికి హాని కలుగని వాటినే ఉపయోగిస్తారు. అనవసరంగా విద్యుత్, నీరు వాడకుండా పొదుపు ఏర్పాట్లు కూడా ఉంటాయి.
నియంత్రణ అవసరం
హరిత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రాయితీలు కల్పిస్తూ, తగిన చట్టాలను రూపొందిస్తే నిర్మాణదారులు, ప్రజలు కూడా హర్షిస్తారు. విద్యుత్, నీరు మరియు ఇతర వనరుల పొదుపును పునఃవినియోగాన్ని డిజైన్ లో పెట్టేవిధంగా ప్రభుత్వం ఆయా పన్నులలో రాయితీలు ఇవ్వాలి. ఈ దిశగా పర్యావరణ స్పృహ ఉన్న పౌరులు, భవన నిర్మాణదారులు, స్వచ్చంద సంస్థలు కృషి చేయాలి. అభివృద్ధి చెందిన దేశాల కంటే వర్ధమాన దేశాలలోనే ప్రకృతికి అనుకూలంగా ఇండ్లు కట్టుకోవడం ఏనాటి నుంచో ఉన్నది.
సిమెంట్ కంటే ముందు సున్నం, పెంకులు, చెక్క, వగైరా పదార్థాలతో ఇండ్లు కట్టుకోవడం ఉండేది. వీటికి ప్రోత్సాహం ఉండాలి. భారత పర్యావరణం, అడవులు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2024లో నిర్మాణం, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ నియమాల 2024 పత్రం ఒకటి విడుదల చేసింది. దీని ప్రకారం నిర్మాణం, కూల్చివేతల సమయంలో ఉత్పన్నం అయ్యే నేల, ఇసుక, వంటి అన్ని పదార్థాల వ్యర్ధాల బాధ్యత నిర్మాణదారుల మీద ఉంటుంది. తెలంగాణలో, ప్రత్యేకంగా హైదరాబాద్ మహానగరంలో బహుళ అంతస్తుల నిర్మాణాలకు మీద నియంత్రణ అవసరం.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్