
- ఇప్పుడు మాపై బురద జల్లుతున్నది: మంత్రి పొంగులేటి
- ‘రప్పా.. రప్పా’ అంటూ ధర్నాలు చేస్తున్నదని ఫైర్
- రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని వెల్లడి
నల్గొండ, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టుకు పర్మిషన్ ఇచ్చిందే బీఆర్ఎస్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. గోదావరి నీళ్లను పెన్నాకు తీసుకుపోవాలన్న అంశం బీఆర్ఎస్ హయాంలోనే మొదలైందని తెలిపారు. ఆదివారం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో 3 వేల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి పొంగులేటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘2016లో 400 టీఎంసీల గోదావరి నీళ్లను ఏపీకి ఇచ్చేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించింది.
బనకచర్లపై ఆ పార్టీ ఏనాడూ నోరెత్తలేదు. వాళ్ల తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు మాపై బురద జల్లుతున్నది” అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సొమ్ము, హక్కులను ఏపీకి బీఆర్ఎస్ నేతలు తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని, బనకచర్ల విషయంలో ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.
కాళేశ్వరం స్కామ్ బయటపడుతుందన్న భయంతోనే మా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నిందలు వేస్తున్నది. జ్యుడీషియల్ కమిషన్ విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ నేతలు ఆగమవుతున్నారు. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు?” అని ప్రశ్నించారు.
20 లక్షల ఇండ్లు కట్టిస్తం..
రప్పా.. రప్పా’ అనే ఫ్లెక్సీలతో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ధర్నాలు చేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. ‘‘రప్పా..రప్పా ధర్నాలతో రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఏం చేస్తారు? ఫ్యాక్షనిజాన్ని తెరమీదకు తెద్దామనుకుంటున్నారా?’’ అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 8.60 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిని ఆగస్టు 15 కల్లా పరిష్కరిస్తామని తెలిపారు.
పేదవాడి సొంతింటి కలను మా ప్రభుత్వం సాకారం చేస్తున్నది. మొదటి విడతగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. రానున్న మూడున్నరేండ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తాం. ఆ తర్వాతే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తాం” అని చెప్పారు.