భద్రాచలం, వెలుగు: పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ముందుగా దుమ్ముగూడెం మండలం బండిరేవులో రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన, చింతగుప్ప గ్రామం నుంచి బురదమడుగు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ, ములకపాడులో మినీస్టేడియంలో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్తో కూడిన మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రాజ్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఏఎంసీ చైర్మన్ తెల్లం సీతక్క తదితరులు పాల్గొన్నారు. అనంతరం భద్రాచలంలోని భద్రగిరిమార్టును సందర్శించారు. ఆర్గానిక్ వస్తువులతో పాటు ఆదివాసీలు సేకరించిన అటవీ ఉత్పత్తులను తక్కువ ధరకు మన్నికతో అందిస్తున్న ఐటీడీఏ పీవో బి.రాహుల్ను మంత్రి అభినందించారు.
