హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్తో ముప్పు లేదని, బీజేపీతో మాత్రమే ఉందని తమ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలను, రేవంత్రెడ్డి వక్రీకరించాడని ఆయన ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్లో పొన్నాల మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు వస్తానంటే, వద్దని వారించానని కేసీఆర్ చెప్పాడన్నారు. కానీ, ప్రభుత్వాన్ని కూలుస్తామని కేసీఆర్ చెప్పలేదన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ తమ సర్కార్ను కూల్చబోతున్నాడంటూ ప్రతి సభలోనూ చెప్పుకుంటున్నాడన్నారు. ఆయన చేస్తున్న ఈ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని అడుగుతుంటే, వాటి గురించి మాట్లాడకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆయన దుయ్యబట్టారు.