తిమ్మాపూర్, వెలుగు: లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూతురు కవితను సీబీఐ, ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదో ఎంపీ బండి సంజయ్ ప్రజలకు చెప్పాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్మండలం మహాత్మానగర్ లో 30 ఏండ్లుగా ఎస్సారెస్పీ స్థలంలో గుడిసెలు వేసుకుంటున్న వారి స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవితను అరెస్టు చేస్తారని చెప్పిన సంజయ్ ఇప్పుడు ఎందుకు మౌనంగాఉన్నారని ప్రశ్నించారు.
కరీంనగర్ ఎంపీగా పోటీ చేసేందుకు భార్య మంగళ సూత్రాలు అమ్ముకున్న బండి సంజయ్ కు వందల కోట్లు ఖర్చు చేసే స్థోమత ఎక్కడిదని మండిపడ్డారు. గ్రానైట్ మాఫియా, మంత్రి గంగుల కమలాకర్ తో కుమ్మక్కైనట్లు పార్టీ నాయకులే విమర్శిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ, కిసాన్ సెల్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌడ్, ఎలకపల్లి సంపత్, నాయకులు గూడ కనకయ్య, కేతిరెడ్డి ఎల్లారెడ్డి, బొంగాని రాజు, మామిడి అనిల్ కుమార్, గూడ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.