నేను​ గెలిస్తే ఇంటికో ఎమ్మెల్యే ఉన్నట్టే: పొన్నం ప్రభాకర్​

నేను​ గెలిస్తే ఇంటికో ఎమ్మెల్యే ఉన్నట్టే: పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​, వెలుగు :ప్రజాపాలన పునరుద్ధరించాలంటే ప్రజలు కాంగ్రెస్​కు అండగా నిలవాలని కాంగ్రెస్​ హుస్నాబాద్​ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​ పిలుపునిచ్చారు. తాను గెలిస్తే ఇంటికొక ఎమ్మెల్యే ఉన్నట్టే అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండలం మంచినీళ్లబండ, కేశవాపూర్​, గొల్లపల్లె, మల్లంపల్లి, మోత్కులపల్లి, టేకుమట్ల, పెద్ద, పంజాగుట్ట తండాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాల గురించి వివరించారు.

కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని, రాజ్యాంగం ప్రకారం పాలించే ఏకైక పార్టీ తమదే అన్నారు. లక్ష రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామన్న సీఎం కేసీఆర్ మాట నిలుపుకోలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ,  బడుగు బలహీన వర్గాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ప్రజల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే రాజభోగాలు అనుభవించిందన్నారు. ఇక నుంచైనా ఆ పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందన్నారు.