లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నరు..!: పొన్నం ప్రభాకర్​

లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నరు..!: పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​, వెలుగు : పదేండ్లుగా ప్రజలను చీడపురుగుల్లా చూస్తూ, వారు ఇచ్చిన అధికారంతో రూ.లక్షల కోట్లు దోచుకున్న దొరల పాలన కావాల్నా..? ప్రజలకు పాలేరుగా ఉంటూ సేవలు చేసే కాంగ్రెస్​ ప్రభుత్వం కావాల్నా తేల్చుకోవాలని ఆ పార్టీ హుస్నాబాద్​ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​అన్నారు. బుధవారం ఆయన నామినేషన్​వేసిన అనంతరం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్​రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. పదేండ్లుగా సెక్రటేరియట్​కు రాకుండా, ఫామ్​హౌజ్​కే పరిమితమై రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని మింగిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు.

గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రజలను కలవకుండా ఉండలేదన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు, తన కుటుంబానికి కమీషన్లు రాబట్టుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నారన్నారు. భారీ అవినీతితో క్వాలిటీ లేకుండా కట్టిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు పనికిరాకుండాపోయిందన్నారు. రాజ్యాంగాన్ని కాదని సొంత ఎజెండాతో రాజరికపాలన సాగించారన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల నియోజకవర్గాలనే అభవృద్ధి చేసుకున్నారన్నారు. కేసీఆర్​కు దగ్గరివాడని చెప్పుకునే వొడితల సతీశ్​కుమార్​ హుస్నాబాద్​ సెగ్మెంటులో ఎలాంటి అభవృద్ధి చేయలేదన్నారు.