- ప్రభుత్వ వాటా కొనుగోలుకు బోర్డ్ ఆమోదం
న్యూఢిల్లీ: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)లోని ప్రభుత్వానికి చెందిన 52.63శాతం వాటాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఆర్ఈసీ, పీఎఫ్సీకి అనుబంధ సంస్థగా మారుతుంది. కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ (సీసీఈఏ) అనుమతి ఇవ్వడంతో పీఎఫ్సీ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. పీఎఫ్సీలో కేంద్రానికి 55–56 శాతం వాటా ఉండడంతో విలీన సంస్థ కూడా ప్రభుత్వ కంపెనీగానే కొనసాగుతుంది. ఆర్బీఐ నియమాల కారణంగా పీఎఫ్సీ, ఆర్ఈసీలు రెండు వేర్వేరు సంస్థలుగా ఉన్నాయి. ఆర్బీఐ ఒక ఎన్బీఎఫ్సీకి ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ (ఇచ్చే గరిష్ట అప్పు)ను 25శాతానికి పరిమితం చేస్తోంది. పీఎఫ్సీ, ఆర్ఈసీ విలీనంతో ఈ పరిమితిని పెంచే అవకాశం ఉంది. పీఎఫ్సీ షేరు శుక్రవారం 1.01శాతం పెరిగి రూ.419.20కి చేరగా, ఆర్ఈసీ షేర్ 2.51 శాతం తగ్గి రూ.372.50 వద్ద ముగిసింది.
