గెలిచేది బీజేపీ మాత్రమే: ప్రకాశ్ జవదేకర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని, గెలిచేది బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్, మాజీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. సోమవారం ఎలక్షన్కమిషన్ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసం ఉందని, ఇక్కడి ప్రజలను కాపాడేది కూడా బీజేపీయేనన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పాత్ర ఏమీ ఉండబోదని పేర్కొన్నారు. ‘జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అందరూ చూశారు.
ఇప్పుడు కూడా ఆ పార్టీ పరిస్థితి అదే స్థాయిలో ఉండబోతుంది. ఎన్నికలకు బీజేపీ బూత్ స్థాయిలోనే కాదు.. అన్ని స్థాయిల్లో సిద్ధంగా ఉంది. ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కన్నా బీజేపీ ముందంజలో ఉంది’ అని జవదేకర్ అన్నారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసేది బీజేపీ మాత్రమేనన్నారు.
బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఈసారి రాష్ట్ర ప్రజల ఆగ్రహం నుంచి కేసీఆర్ తప్పించుకోలేరన్నారు.