హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్ రావు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని పిటిషన్

హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్ రావు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని పిటిషన్

ఫోన్ టాపింగ్ కేసులో నిందితుడిగా కొనసాగుతున్న పోలీస్ అధికారి ప్రణీత్‌ రావు హైకోర్టును ఆశ్రయించారు.  పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్ రావు పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. వాస్తవాంశాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు కస్టడీకి ఇచ్చిందని పిటిషన్ లో పేర్కొన్నారు.

  కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పూర్తైన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని ప్రణీత్ రావు కోరారు. దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే సమాచారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని కోరారు.

 ఇంటరాగేషన్‌లో ఏఎస్పీ డి.రమేశ్ పాల్గొనకుండా నియంత్రించాలని  కోరారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారని ప్రణీత్ రావు న్యాయవాది తెలిపారు.