- డైరీ, హార్డ్డిస్క్లో వందల సంఖ్యలో ఫోన్ నంబర్స్ గుర్తింపు
- తనకు కావాల్సిన వ్యక్తులు ఇచ్చిన నంబర్స్ కూడా ట్యాప్ చేసినట్టు సమాచారం
- విషయం బయటపడకుండా టీమ్ సిబ్బందికి ప్రమోషన్స్ ఇస్తామని హామీ
హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సీక్రెట్ ఆపరేషన్స్ చిట్టా బయటపడుతున్నది. బేగంపేటలోని ఎస్ఐబీ లాగర్ రూమ్, రాజన్న సిరిసిల్లలోని ప్రణీత్ రావు నివాసంలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావును వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. రెండవ రోజు విచారణలో భాగంగా సోమవారం కీలక వివరాలు రాబట్టారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీపీ వెంకటగిరి టీమ్ ప్రణీత్ రావును ప్రశ్నిస్తున్నది. ఈ మేరకు ప్రణీత్ రావు డైరీలో వందల సంఖ్యలో ఫోన్ నంబర్స్ గుర్తించినట్లు సమాచారం. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్ నంబర్స్ ఉన్నట్లు తెలిసింది. వీటితో పాటు ప్రణీత్ రావు ఆపరేట్ చేసిన హార్డ్ డిస్క్లను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎస్ఐబీ కేంద్రంగా ప్రణీత్ రావు ఓ ప్రైవేట్ నెట్వర్క్ను ఆపరేట్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సీక్రెట్ ఆపరేషన్స్లో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, నలుగురు ఎస్ఐ స్థాయి అధికారులు పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులకు నమ్మకమైన వ్యక్తులని సమాచారం. ఎస్ఐబీ ఆపరేషన్స్ ఏ మాత్రం బయటకు రాకుండా ఉండేలా నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.
ట్యాపింగ్ సాఫ్ట్వేర్ అధికారికంగా కొన్నదేనా?
బేగంపేటలోని ఎస్ఐబీ ఆఫీస్లో ప్రణీత్ రావుకు కేటాయించిన రెండు రూమ్స్ నుంచే ఈ సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ప్రణీత్ రావు ప్రత్యేకంగా హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్స్ను వినిమోగించినట్లు తెలిసింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కోసం ఎలాంటి సాఫ్ట్వేర్ వినియోగించారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మొబైల్ యాప్స్ సహా ఇతర సాఫ్ట్వేర్స్ను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాలను రాబడుతున్నారు. సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం డబ్బు ఎవరిచ్చారనే సమాచారం కూడా సేకరిస్తున్నారు.
నాలుగు లేయర్స్గా ట్యాపింగ్!
లాగర్ రూమ్స్లోకి ఎవరెవరికి యాక్సెస్ ఉందనే కోణంలో అధికారులు ప్రణీత్ రావును ప్రశ్నించినట్లు తెలిసింది. నాలుగు లేయర్స్గా ట్యాపింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పినవే కాకుండా ప్రణీత్ రావుకు చెందిన పొలిటికల్, బిజినెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందించిన ఫోన్స్ నంబర్స్ను కూడా ట్యాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రణీత్ రావుతో పాటు పనిచేసిన సిబ్బందికి ప్రమోషన్స్ ఆశ చూపినట్లు సమాచారం. తమ ఆపరేషన్స్ రహస్యాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది.పెద్దలు చెప్పినట్లు వినే అధికారులకు యాగ్జిలరీ ప్రమోషన్స్ వస్తాయని చెప్పినట్లు తెలిసింది. ఇలాంటి వివరాలతో ప్రణీత్ రావును క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి టెక్నికల్ వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు.