అంధ విద్యార్థుల పాటకు కన్నీరు పెట్టుకున్న రాష్ట్రపతి

అంధ విద్యార్థుల పాటకు  కన్నీరు పెట్టుకున్న రాష్ట్రపతి

డెహ్రాడూన్:పాట పాడుతూ అంధ విద్యార్థులు తనకు బర్త్ డే విషెస్ చెప్పడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చలించిపోయారు. భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. శుక్రవారం ముర్ము 67వ జన్మదినం. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్​లోని డెహ్రాడూన్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్​మెంట్ ఆఫ్ పర్సన్స్  విత్ విజువల్ డిజేబిలిటీస్ (ఎన్ఐఈపీవీడీ) కేంద్రానికి రాష్ట్రపతి వెళ్లారు. అక్కడ అంధ విద్యా ర్థులతో కాసేపు ముచ్చటించారు. తర్వాత విద్యార్థులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ పాట పాడడంతో ముర్ము భావోద్వేగానికి గురయ్యారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు ఎంతో చక్కగా పాడి తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారని, దీంతో భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయానని తెలిపారు. పుట్టుకతోనే అంధులైన అలాంటి వారిలో ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని తాను నమ్ముతానని, ఆ విద్యార్థులను చూస్తే, తన నమ్మకానికి బలం చేకూరుతోందని చెప్పారు. విద్యార్థులు నమ్మకంతో ముందుకు సాగితే విజయం తప్పక సిద్ధిస్తుందన్నారు. అంధ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నదని, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, బాగా చదువుకొని జాతి నిర్మాణానికి కృషి చేయాలన్నారు.