పీఎం అయితే ఏం చేస్తవ్? విద్యార్థికి రాష్ట్రపతి ప్రశ్న

పీఎం అయితే ఏం చేస్తవ్? విద్యార్థికి రాష్ట్రపతి ప్రశ్న

హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులు, బోధనా సిబ్బందితో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో దాదాపు రెండు గంటలపాటు సమావేశమైన రాష్ట్రపతి విద్యార్థులతో స్నేహపూర్వకంగా సంభాషించారు. ఈక్రమంలో ‘‘నువ్వు ప్రధానమంత్రి అయితే ఏం చేస్తావు?’’ అని వరుణ్ గణేశ్ కుల్ కర్ణి అనే ఒక విద్యార్థిని రాష్ట్రపతి అడిగారు. దీనికి ఆ విద్యార్థి బదులిస్తూ.. ‘‘సారే జహాసె అచ్ఛా.. హిందూ సితా హమారా’’ అంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు.

‘‘నేను ఒకవేళ ప్రధానమంత్రిని అయితే.. ఈ దేశాన్ని సంస్కారంతో నింపే ప్రయత్నం చేస్తాను.  దేశం పేరును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు  నావంతుగా ప్రయత్నిస్తాను. మన కళలు, సంస్కృతి, సంగీతం వంటివి పునరుజ్జీవింప చేసే ప్రయత్నం చేస్తాను. పండిట్ భీమాసేన్ వంటి కళాకారులు భారత గడ్డపై మళ్లీ జన్మించి.. భారత సంస్కారం విలువను ప్రపంచానికి చాటిచెప్పాలనేది నా ఆశయం, ఆకాంక్ష’’ అని ఆ విద్యార్థి చెప్పాడు. అనంతరం రాష్ట్రపతి ముర్ము ఆ విద్యార్థిని మెచ్చుకున్నారు. ‘‘ఎంతోమంది భరత నాట్యం, కథాకళి, ఒడిస్సీ వంటి నృత్య రీతులను నేర్చుకుంటూ ఉంటారు. వాటిలో  ఇక్కడి జీవితం, పురాణాలు, సంస్కృతి, అద్భుతమైన గాధలు దాగి ఉన్నాయి. కాకపోతే వాటి కళాత్మకత దాగి ఉంటుంది.’’ అని రాష్ట్రపతి వివరించారు.

ప్రధానమంత్రి అయితే ఏం చేస్తావని మరో విద్యార్థినిని రాష్ట్రపతి ముర్ము ప్రశ్నించగా.. ‘‘ఒకవేళ నేను దేశ ప్రధానమంత్రిని అయితే స్కూళ్లలో పిల్లలు ఇంగ్లిష్ రైమ్స్ కు బదులు వేదాలు, పురాణాలు చదివేలా చేస్తా’’ అని బదులిచ్చింది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఆయన అంతా వింటున్నారు. ‘‘కిషన్ రెడ్డీజీ మీరు ఆ విద్యార్థులు చెప్పినట్టు దేశంలో మార్పును తీసుకొని రండి. వాళ్లు చెప్పినట్టు చేయండి’’ అని  రాష్ట్రపతి ముర్ము  చెప్పారు.