30న యాదగిరిగుట్టకు రాష్ట్రపతి ముర్ము

30న యాదగిరిగుట్టకు రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 30న యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆ రోజు ఉదయం 9.30 నిమిషాలకు యాదగిరిగుట్టకు చేరుకోనున్న ఆమె.. లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన ద్రౌపదీ ముర్ము యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. 15 మంది రాష్ట్రపతుల్లో ఇప్పటి వరకు నలుగురు మాత్రమే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా ద్రౌపదీ ముర్ము స్వామివారిని దర్శించుకున్న ఐదో రాష్ట్రపతిగా నిలువనున్నారు. 

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదాద్రికి రానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా... రాచకొండ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 30న బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి ద్రౌపది ముర్ము ఈఎంఈ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఏఎఫ్‌ ఎం17 హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట దేవస్థానం వద్ద హెలిప్యాడ్‌ స్థలానికి చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక వాహనంలో కొండపైకి చేరుకుంటారు. ముర్ము రాక నేపథ్యంలో రాష్ట్రపతి స్పెషల్ టీం అధికారులు.. స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. మాక్ డ్రిల్ నిర్వహించి.. అధికారులతో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.