పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. కొత్త పార్లమెంటులో ఇది తన తొలి ప్రసంగమని రాష్ట్రపతి అన్నారు. భారత సంస్కృతి, సభ్యత ఎంతో చైతన్యవంతమైనవి అని చెప్పారు. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశం మనదేనని అన్నారు. ఆదిత్య ఎల్-1 మిషన్ను మన దేశం దిగ్విజయంగా ప్రయోగించిందని చెప్పారు.
ఆసియా క్రీడల్లో తొలిసారి వందకు పైగా పతకాలు సాధించామని తెలిపారు రాష్ట్రపతి . దేశంలో 5G నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తోందన్న రాష్ట్రపతి..జీ20 సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించిందని చెప్పారు. కశ్మీర్ లో 370 ఆర్టికల్ ఎత్తివేత ఓ చారిత్రాత్మక విజయవంతమని.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని అడ్డంకులు అధిగమించామని, ఎన్నో ఏళ్ల రామమందిర కల సాకారమైందన్నారు. ఆర్టికల్ 370, CAA, CUU, మహిళా కోటాపై భారత్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న ఎకానమీ మనదేనని వెల్లడించారు.
తెలంగాణలో సమ్మక్క, సారక్క ట్రైబల్ యూనివర్శిటి ఏర్పాటు కాబోతుందని తెలిపారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ మన దేశ లక్ష్యమన్నారు. గరీబ్ హఠావో అనే నినాదాలు మాత్రమే విన్నామని.. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేశామన్నారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించామన్నారు. ఐటీ రిటర్న్ ఫైల్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు రాష్ట్రపతి . 25 కోట్ల మందిని పేదరికం నుంచి పైకి తీసుకువచ్చామని తెలిపారు.
లోక్ సభలో రేపు మోదీ సర్కార్ ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఫిబ్రవరి 09 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ ఏడాదిలోనే లోక్సభ ఎన్నికలు ఉండటంతో ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.