
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ కొన్ని రోజుల నుంచి రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్.. బ్రిజ్ భూషణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు రాజీ కోసం తమపై విపరీతమైన ఒత్తిడి ఉందని తెలిపారు. శరణ్ తన మనుషులను పిలిచి ఫిర్యాదుదారులను బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించారు.
బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనలకు నాయకత్వం వహిస్తున్న దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లలో ఒకరైన బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని, మైనర్ బాలికపై ఒత్తిడి తేవడంతో ఆయన తన కూతురు మైనర్ కాదని, ముందు తెలియక అలా చెప్పానని కోర్టుకు తెలిపారు. తన కూతురు మేజర్ అని వెల్లడించారు. దీంతో ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ క్రమంలో విచారణను నిర్వీర్యం చేయడానికి, ఫిర్యాదుదారులను, సాక్షులను బెదిరించేంత శక్తి, ప్రభావం నిందితుడికి ఉన్నందున అతన్ని అరెస్టు చేసి, కస్టడీలో ఉంచాలని తాము మొదటి రోజు నుండి డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్ ను అరెస్టు చేయకుండా విచారణ నిష్పక్షపాతంగా జరగదని సాక్షి మాలిక్ అన్నారు.
కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన దర్యాప్తు గడువు జూన్ 15 తర్వాత భవిష్యత్తు వ్యూహాన్ని ప్లాన్ చేయాలని 'మహాపంచాయత్' ఈరోజు నిర్ణయించిందని పునియా చెప్పారు. శరణ్ ని అరెస్టు చేయాలనే తమ డిమాండ్ నుంచి తాము వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసు విచారణపై నమ్మకం లేదని చెప్పారు. బ్రిజ్ భూషణ్ సింగ్ను కాపాడే ప్రయత్న చేస్తున్నారని ఆరోపించారు. తాము అన్నింటినీ రిస్క్ చేశామన్న పునియా.. బలమైన ఛార్జిషీట్ ఉంటే బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేస్తారని చెప్పుకొచ్చారు.
ఇక బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గతంలో తనపై వచ్చిన లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. "నాపై ఒక్క ఆరోపణైనా రుజువైతే, నేను ఉరివేసుకుంటాను, మీ వద్ద (రెజ్లర్లు) ఏవైనా ఆధారాలు ఉంటే, వాటిని కోర్టుకు సమర్పించండి, ఎలాంటి శిక్షనైనా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని గతంలో ఖరాకండీగా చెప్పేశాడు.