కంటోన్మెంట్, వెలుగు: గత 50 ఏండ్లుగా వేలాది మంది స్టూడెంట్లకు విద్యనందించిన కంటోన్మెంట్ తాడ్బండ్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలం భూ వివాదంలో చిక్కుకుంది. సమ్మర్హాలిడేస్లో స్కూల్ గేటుకు తాళాలు వేసిన కంటోన్మెంట్ అధికారులు.. తాజాగా స్కూల్ స్థలం తమది అంటూ అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్కూల్స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. దీంతో ప్రస్తుతం స్కూల్లో చదువుకుంటున్న తమ పిల్లల పరిస్థితి ఏమిటోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అర్ధ శతాబ్ద కాలంగా ఈ స్కూల్తోపాటు, స్కూల్ ఆవరణలోని స్థలాన్ని కాపాడుతూ వచ్చామని, తమకే సర్వహక్కులు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ఫలించని ప్రయత్నాలు
తాడ్ బండ్లోని ఎకరం స్థలంలో ప్రాథమిక పాఠశాల ఉంది. కరోనాకు ముందు 60 మంది స్టూడెంట్లతో నడిచిన ఈ స్కూల్లో ప్రస్తుతం 20 మంది చదువుకుంటున్నారు. దీంతో కంటోన్మెంట్ అధికారులు, రాష్ట్ర పోలీస్ విభాగం ఈ స్కూల్ను మరో చోటకు తరలించి కోట్ల విలువ చేసే స్కూల్స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టాయి. తాడ్బండ్ఏరియాకు కొత్త పోలీస్స్టేషన్మంజూరు కాగా.. దాని ఏర్పాటుకు ఆ స్కూల్స్థలాన్ని పరిశీలించారు. పీఎస్నిర్మాణానికి అనువైనదిగా భావించిన పోలీసులు తమకు కేటాయించాలని కంటోన్మెంట్ బోర్డు, విద్యాశాఖ అధికారులను సంప్రదించారు. అయితే ఆ స్కూల్ను అప్గ్రేడ్చేస్తామని, ఆ స్థలాన్ని ఎవరికీ ఇవ్వబోమంటూ విద్యాశాఖ స్పష్టం చేయడంతో పోలీసులు తమ ప్రయత్నాలను విరమించుకున్నారు.
సామగ్రిని భద్రపరుస్తూ..
కానీ పట్టు వదలని కంటోన్మెంట్బోర్డు అధికారులు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆ స్కూల్టీచర్లు చెబుతున్నారు. కొంతకాలంగా స్కూల్ ఆవరణలో ఇంజనీరింగ్విభాగానికి చెందిన సామగ్రిని భద్రపరుస్తున్నారని, తద్వారా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని పేర్కొంటున్నారు. వేసవి సెలవుల్లో స్కూల్మూవేసి గేటుకు తాళాలు వేసుకుని టీచర్లు వెళ్లిపోగా.. ఈనెల12న స్కూళ్లు ప్రారంభం కావడంతో టీచర్లు, స్టూడెంట్లు స్కూల్కు రాగా గేటుకు వేరే తాళం వేసి ఉంది. కంటోన్మెంట్ అధికారులేఈ పని చేసినట్లుగా గుర్తించిన టీచర్లు.. వారిని సంప్రదించగా స్కూల్స్థలం తమ ఆధీనంలో ఉందని, తాళాలు తీయబోమని స్పష్టం చేశారు. టీచర్లు పోలీసులకు కంప్లైంట్చేయడంతో దిగి వచ్చిన బోర్డు అధికారులు వెంటనే వచ్చి గేటు తాళం తీశారు.
స్కూల్ నడిపేందుకు పర్మిషన్ ఇవ్వలేదు
అయితే, సమస్య సద్దుమణిగిందని భావిస్తున్న టైంలో ఇటీవల కంటోన్మెంట్బోర్డు సీఈఓ మధుకర్నాయక్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగానికి చెందినహైలెవెల్ కమిటీ బృందంస్కూల్ను సందర్శించింది. ఈ స్థలంపై పూర్తి హక్కులు కంటోన్మెంట్బోర్డుకే ఉన్నాయని, ఇక్కడ స్కూల్ను నడిపేందుకు విద్యాశాఖ అధికారులు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిపింది. అందుకు సంబంధించి ఎలాంటి రికార్డులు తమ వద్ద లేవని, ఏమైనా ఉంటే చూపించాలని కోరింది. త్వరలోనే విద్యాశాఖ అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పింది. స్కూల్ స్థలం తమదేనని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన బోర్డు అధికారులు.. స్కూల్నడిపేందుకు ఎలాంటి ఆటంకాలు కలిగించలేదని వెల్లడించారు.
స్టూడెంట్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి
బస్తీల్లోని నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ స్కూల్లోనే చదివిస్తున్నారు. స్కూల్స్థలాన్ని కంటోన్మెంట్బోర్డు స్వాధీనం చేసుకుంటే పేద పిల్లలకు విద్య దూరమయ్యే ప్రమాదముంది. స్కూల్ నిర్వహణకు బోర్డు అధికారులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. ఆ స్థలాన్ని స్కూల్కే కేటాయించాలి.
– షడ్రక్, ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి