హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్షో

హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్షో

హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్షోలో పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు-నారాయణగూడ ఫ్లైఓవర్, వైఎంసీఏ చౌరస్తా మీదుగా కాచిగూడ చౌరస్తా వరకు దాదాపు మూడు కిలోమీటర్లు ప్రధాని రోడ్ షో సాగింది. కాచిగూడలో వీర సావర్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు ప్రధాని మోదీ. 

ప్రధాని మోదీ రోడ్ షోకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రోడ్డు కిరువైపు సందడి చేస్తూ కనిపించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. మోడీపై పూలవర్షం కురిపిస్తూ డప్పులు, డ్యాన్సులతో ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ శ్రేణులు, అభిమానులు. రోడ్ షో మార్గంలో పూలవర్షం కురిపించారు అభిమానులు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి కాచిగూడ వరకు రోడ్డు వెంట దాదాపు మూడు కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరి నిల్చొని ఉన్నారు.  

అనంతరం కార్తీక మాసం చివరి రోజైన సోమవారం( నవంబర్ 27) ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో కోటి దీపారాధన మహోత్సవానికి ప్రధాని విశిష్ట అతిథిగా హాజరయ్యారు. కార్తీక దీపోత్సవం, ప్రధానిరాక సందర్భంగా  భారీ ఎత్తున్న జనం ఎన్టీఆర్ గార్డెన్స్ కు తరలి వచ్చారు.  

ప్రధాని మోదీ రాక సందర్భంగా హైదరాబాద్ నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా రోడ్ షో జరుగుతున్న మార్గంలో పూర్తిస్థాయిలో ట్రాఫిక్ నిలిపివేశారు.  మెట్రో స్టేషన్లను సైతం మూసివేశారు.