వాషింగ్టన్: ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరియైన సమయమని ఎంటర్ప్రెనూర్లను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూఎస్ పర్యటనలో ఉన్న ఆయన ఇండియా, యూఎస్కు చెందిన ఎంటర్ప్రెనూర్లు, ఫిలాంత్రపిస్టులు, ప్రముఖులతో వాషింగ్టన్లోని కెన్నడి సెంటర్లో మాట్లాడారు. బిజినెస్లకు కోసం గ్రౌండ్ వర్క్ పూర్తి చేశామని, ఇన్వెస్ట్ చేసి ప్రయోజనం పొందాలని కోరారు. ప్రొఫెషనల్స్ ఇండియాతో పార్టనర్షిప్ కుదుర్చుకోవాలని అన్నారు. యూఎస్, ఇండియా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి గత మూడు రోజుల్లో అనేక హిస్టారికల్ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. డిఫెన్స్ నుంచి ఏవియేషన్ వరకు, అప్లయ్డ్ మెటీరియల్స్ నుంచి మాన్యుఫాక్చరింగ్ వరకు, ఐటీ నుంచి స్పేస్ సెక్టార్ వరకు ఇండియా, యూఎస్ కలిసి ముందుకెళుతున్నాయని చెప్పారు.
యూఎస్ –ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్కు సుమారు వెయ్యి మంది హాజరయ్యారని అంచనా. ఇండియాలో ప్రస్తుతం ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడానికి వ్యాపారులు ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. ఇండియాలోని ప్రతీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ యూఎస్తో ఉన్న సంబంధాన్ని బలోపేతం చేయగలదని చెబుతూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 125 బిలియన్ డాలర్ల (రూ. 10 లక్షల కోట్ల) ను ఖర్చు చేశామని గుర్తు చేశారు. యూఎస్తో టెక్నాలజీ పార్టనర్షిప్ను కుదుర్చుకున్నామని చెబుతూ, బిజినెస్లు, మాన్యుఫాక్చరర్లు, ఇన్నోవేటర్లు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరియైన సమయమని పేర్కొన్నారు. ఇండియా బలంగా ఉంటే ప్రపంచానికి లాభమని, కరోనా టైమ్లో ఇది నిరూపితమయ్యిందని మోదీ అన్నారు. ప్రపంచానికి మెడిసిన్స్ అవసరమైనప్పుడు ఇండియా తన ప్రొడక్షన్ను పెంచి అందించిందని గుర్తు చేశారు.
గత రెండున్నరేళ్లలో ఇండియాలో యూఎస్ కంపెనీలు 16 బిలియన్ డాలర్ల (రూ. 1.31 లక్షల కోట్ల) ను ఇన్వెస్ట్ చేశాయన్నారు. ‘ఇండియా ప్రపంచంలోనే యంగెస్ట్ దేశం. ఎక్కువ మంది యువత, స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉన్న దేశం. ఈ టైమ్లో ఇండియాతో కలిసిన ఏ దేశమైన లాభపడుతుంది’ అని వివరించారు. ఫిస్కల్ డెఫిసిట్ కంట్రోల్లో ఉందని, క్యాపెక్స్ను పెంచుతున్నామని ఎంటర్ప్రెనూర్లకు మోడీ తెలియజేశారు. ఇండియా ఫారెక్స్ నిల్వలు పెరుగుతున్నాయని, ఎఫ్డీఐలలో కొత్త రికార్డ్లు క్రియేట్ అవుతున్నాయని అన్నారు. ఈ ఈవెంట్లో యూఎస్ సెక్రెటరీ ఆంటోని బ్లింకిన్, యూఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ ప్రెసిడెంట్ ముకేశ్ అఘి, సిస్కో చైర్మన్ జాన్ ఛాంబర్స్ కూడా పాల్గొన్నారు.
ఇండియాలో అమెజాన్, గూగుల్ పెట్టుబడులు..
ఇండియాలో భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు గూగుల్, అమెజాన్ ముందుకొచ్చాయి. ప్రధాని మోదీతో సమావేశం అయ్యాక ఈ కంపెనీల సీఈఓలు ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి ప్రకటనలు చేశారు. గూగుల్ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో గ్లోబల్ ఫిన్టెక్ ఆపరేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తుందని కంపెనీ సీఈఓ సుందర్ పిచయ్ ప్రకటించారు. ఇండియాలో మరింతగా విస్తరించాలన్న తమ కమిట్మెంట్కు ఇది నిదర్శనమని చెప్పారు. అంతేకాకుండా ఇండియన్ స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేసేందుకు 10 బిలియన్ డాలర్ల డిజిటైజేషన్ ఫండ్ను ఏర్పాటు చేశామన్నారు. దేశ డిజిటల్ రివల్యూషన్కు సాయపడతామని చెప్పారు. గూగుల్ వర్చువల్ అసిస్టెన్స్, బార్డ్ను మరిన్ని ఇండియన్ లాంగ్వేజ్లలో లాంచ్ చేస్తామని పిచయ్ అన్నారు. ప్రధాని మోదీని పిచయ్ పొగడ్తలతో ముంచెత్తారు. ‘ప్రధాని మోదీ విజనరీ. ఆయన తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్ వైపు ప్రస్తుతం ప్రపంచం అంతా చూస్తోంది. డిజిటైజేషన్కు ఆయనిచ్చిన ప్రాధాన్యంతో ప్రస్తుత ఇండియా టెక్నాలజికల్ హబ్గా మారింది’ అని సుందర్ పిచయ్ పేర్కొన్నారు. మరో స్టేట్మెంట్లో అమెజాన్ కూడా ఇండియాలో భారీగా ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. ఇండియా గ్రోత్పై పాజిటివ్గా ఉన్నామని, ఇంకో ఏడేళ్లలో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని అమెజాన్ సీఈఓ అండ్రూ జస్సీ అన్నారు.
ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన 11 బిలియన్ డాలర్లను కలుపుకుంటే కంపెనీ మొత్తం పెట్టుబడులు 26 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని వివరించారు. కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేయడానికి, చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు డిజిటల్ సపోర్ట్ను ఇవ్వడానికి, ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రొడక్ట్లను ఎక్స్పోర్ట్ చేయడానికి తాజా ఇన్వెస్ట్మెంట్స్ను వాడతామన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ప్రధాని మోదీని కలిశారు. వీరి మధ్య జరిగిన చర్చల వివరాలు బయటకురాలేదు. కానీ, ఏఐ వాడడంపై నాదెళ్లతో మోదీ మాట్లాడారని కంపెనీ ప్రకటించింది.