- హైకోర్టులో ప్రైవేట్ వ్యక్తుల పిటిషన్
హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాలు కేటాయిస్తూ చేసిన ఒప్పందాన్ని రద్దు చేయా లని కోరుతూ ప్రైవేటు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు వారసత్వంగా వచ్చిన భూమిని బీఆర్ఎస్కు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. సర్వే నంబర్ 239, 240లో 11 ఎకరాలను బీఆర్ఎస్కు అప్పగిస్తూ ప్రభుత్వం చేసిన ఒప్పందాన్ని రద్దు చేయాలని సికింద్రాబాద్కు చెందిన జే.అశోక్ దత్, జయశ్రీ, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్ను జస్టిస్ కే.లక్ష్మణ్ విచారించారు.
పిటిషనర్ తరఫు అడ్వకేట్ మురళీ మనోహర్ వాదిస్తూ.. ఈ భూమి పిటిషనర్లకు వారసత్వంగా వస్తున్నదని చెప్పారు. నవాబ్ నుస్రత్ జంగ్ –1 వారసుల నుంచి పవర్ ఆఫ్ అటార్నీ పొందిన జేహెచ్ కృష్ణమూర్తి నుంచి 1967లో పిటిషనర్ల పూర్వీకులు కొనుగోలు చేశారన్నారు. తమకు రాజ్యాంగం కల్పించిన 300ఏ కింద ఆస్తి హక్కుకు భంగం కలిగించారని చెప్పారు. 1950లో నవాబు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం..
ఇది ప్రభుత్వ భూమి కాదని తెలిపారు. గతేడాది మే 23న బీఆర్ఎస్కు ప్రభుత్వం చేసి ఇచ్చిన కన్వేయన్స్ డీడ్ను రద్దు చేయాలని కోరారు. అంతేగాకుండా, ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.
