
నేడు సోమవారం (మే26న) నిర్మాత దిల్రాజు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యలపైనా దిల్ రాజు మాట్లాడి క్లారిటీ ఇచ్చారు.
దిల్ రాజు మాటల్లో.. ‘‘ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, సినిమా రంగానికి సంబంధించి ప్రత్యేక పాలసీని రూపొందించాలని వంటి నిర్ణయం తీసుకున్న మంత్రి కందుల దుర్గేశ్ కు కృతజ్ఞతలు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి మినిస్టర్ కందుల దుర్గేశ్ ఇచ్చిన స్టేట్మెంట్తో వివాదానికి తెరపడింది.
మొదట ఈస్ట్ గోదావరి నుంచి ఈ చర్చ ప్రారంభం అయ్యింది. అక్కడ ఏప్రిల్ 19న ఎగ్జిబిటర్స్ మీటింగ్లో ఎగ్జిబిటర్లు వారి నష్టాలపై చర్చలు చేసుకున్నారు. థియేటర్లు వర్కౌట్ అవ్వటం లేదు. పర్సెంటేజ్ విధానం ఉంటే బాగుంటుందని అక్కడ ఎగ్జిబిటర్లు చెప్పుకోవడం జరిగింది. వాళ్ల కష్టాలు మాకు తెలుసు. గత ఆరు నెలలుగా వస్తున్న రెవెన్యూ గురించి ఈ సందర్భంగా వారిని అడిగాం. పర్సంటేజీ విధానం ఉంటే బాగుంటుందని వారు చెప్పారు.
ఆ తర్వాత ఏప్రిల్ 26 న గిల్డ్లో మీటింగ్ జరిగింది. అందులో థియేటర్స్ బంద్ పై నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ ఆర్ పర్సంటేజీ విధానం నడుస్తోంది. మొదటి వారం బాగా రెవెన్యూ వస్తే, రెంట్ ఇస్తున్నాం. సెకండ్ వీక్ కలెక్షన్లు తగ్గగానే పర్సంటేజీ ఇస్తున్నా. అది వాళ్లకు కష్టమైనదే. ఆ విషయం మా అందరికీ తెలుసు. దీనిపై సమగ్రమైన న్యాయం జరగాలని చర్చిస్తున్నాం. కానీ, ఓ కొలిక్కి రాలేదు. ఇక అప్పుడే సింగిల్ థయేటర్స్ ఎందుకు రన్ అవ్వడం లేదో 6 నెలల పాటు చెక్ చేసుకోవాలని కూడా అనుకున్నామని’’ దిల్ రాజు తెలిపారు.
ALSO READ | Dil Raju: నిర్మాత దిల్రాజు కీలక ప్రెస్ మీట్.. పవన్ సినిమా ఆపే దమ్ము, ధైర్యం లేదు
అలాగే థియేటర్ల లెక్కల విషయంపై దిల్ రాజు మాట్లాడుతూ.. 'నైజాంలో మొత్తం 370 సింగిల్ థియేటర్స్. అందులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు హోమ్ బ్యానర్) 30 థియేటర్స్ నడుపుతుంది. ఏషియన్ 120 నడుపుతుంది. 370 లో 250 థియేటర్స్ ఓనర్స్ నడుపుతున్నారని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.
థియేటర్స్ బంద్ విషయంపై మాట్లాడుతూ.. 'ఏపీ, తెలంగాణా నుంచి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఏప్రిల్ 18 న మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ లాస్ట్ లో నేను 15 నిమిషాలు వెళ్ళాను. అక్కడ వారు థియేటర్స్ బంద్ నిర్ణయించడంతో వద్దని చెబితే సరే అన్నారని' దిల్ రాజు వెల్లడించారు.
ఒకవేళ ఎగ్జిబిటర్స్ రాసిన డిమాండ్స్ కు సంబంధించిన లెటర్ లోని అంశాలను పరిష్కరించకపోతే థియేటర్స్ బంద్ ఉండేలా వారు నిర్ణయం తీసుకున్నట్లుచెప్పారు. ఇక ప్రభుత్వం చొరవతో అన్నీ సమస్యలపై తెరపడిందనే విషయాన్ని దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం దిల్ రాజు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రతిచోట ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు లాభాలు తెచ్చుకుని థ్యాంక్స్ మీట్ కూడా ఏర్పాటు చేసుకునేలా చేశాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మించిన నితిన్ తమ్ముడు సినిమా రిలీజ్ కు రెడీ ఉంది.