
తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ల ఇష్యూ నడుస్తున్న విషయం తెలిసిందే. రెంటల్ బేసిస్లో షోలు వేయలేమని ఇటీవల ఎగ్జిబిటర్స్ తేల్చి చెప్పారు. పర్సంటెజీ రూపంలో చెల్లింపులు చేస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు.
ఈక్రమంలో నేడు సోమవారం (మే26న) సినీ పరిశ్రమలో నెలకొన్న అన్ని అంశాలపై నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు కీలక మీడియా సమావేశం నిర్వహించారు.
9 రోజుల నుంచి సినీ పరిశ్రమలో జరుగుతున్న విషయాలపై ఏపీ మినిస్టర్ కందుల దుర్గేశ్ ఇచ్చిన స్టేట్ మెంట్ పట్ల కృతజ్ఞతలు తెలిపారు దిల్ రాజు. మొదట ఈస్ట్ గోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లుకి ఓ మీటింగ్ జరిగింది. అక్కడ ఆ మీటింగ్ లో ఎగ్జిబిటర్లు తమ సమస్యలను చెప్పుకొచ్చారు. థియేటర్లు వర్కౌట్ అవ్వటం లేదు. పర్సెంటేజ్ విధానం ఉంటే బాగుంటుందని అక్కడ ఎగ్జిబిటర్లు చెప్పుకోవడం జరిగిందని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం ఏడాదికి 150 సినిమాలు రిలీజైతే.. అందులో 90 సినిమాలు పర్సెంటేజ్ విధానంలో ఆడుతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రమే రెంట్ లేదా పర్సెంటేజ్ విధానంలో నడుస్తున్నాయి. అందువల్ల రెంట్ లేదా పర్సెంటేజ్ విధానంలో నడుస్తున్న దగ్గరే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని దిల్ రాజు స్పష్టం చేశారు. కాబట్టి ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మీటింగ్లో ఈ సమస్య బయటపెట్టడం జరిగిందని దిల్ రాజు అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ముందు థియేటర్స్ బంద్ చేసే దమ్ము ఎవరికి లేదని దిల్ రాజు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా హరి హర వీరమల్లు సినిమా జూన్ 12 న రిలీజ్ కానుంది.