గండిపేట, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ(పీజేటీఏయూ) అద్భుత ప్రగతి సాధిస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. సోమవారం ఆయనను లోక్భవన్లో పీజేటీఏయూ వీసీ జానయ్య కలిసి వర్సిటీ ప్రగతి నివేదిక అందించారు. దానిని ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ మాట్లాడారు.
వ్యవసాయ కూలీల పిల్లలకు 15 శాతం సీట్లు కేటాయించం గొప్ప విషయమన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో వర్సిటీ 37వ ర్యాంకు నుండి 24వ స్థానానికి ఎగబాకడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మంచి పనితీరు కనబరచాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న మూడు బ్యాచ్ లకు కలిపి ఒకే స్నాతకోత్సవాన్ని ఫిబ్రవరి 2026లో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను జానయ్య విజ్ఞప్తి చేశారు. త్వరలోనే స్నాతకోత్సవం తేదీలను ఖరారు చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు.
