ఓపెన్ ప్లేసుల్లో పొగాకు వాడకం బ్యాన్ చేయండి

ఓపెన్ ప్లేసుల్లో పొగాకు వాడకం బ్యాన్ చేయండి
  • అన్ని రాష్ట్రాలకు, యూటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడటం, ఉమ్మివేయడాన్ని నిషేధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు శనివారం అన్ని రాష్ట్రాల సీఎస్​లకు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. తంబాకు, పాన్ మసాలా, సుపారి, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులను నమలడంతో లాలాజలం ఎక్కువగా వచ్చి తప్పకుండా ఉమ్మివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దాంతో కరోనా వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశం ఉంటుంది లేఖలో పేర్కొంది. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్​మెంట్ యాక్ట్, ఐపీసీ 1860, సీఆర్ పీసీ లోని వివిధ రూల్స్ ప్రకారం రాష్ట్రాలు, యూటీలు ఈమేరకు ఆదేశాలు జారీ చేయవచ్చునని గుర్తుచేసింది. పొగాకు ఉత్పత్తులను వాడటం, ఉమ్మివేయడాన్ని నిషేధించేందుకు ఆయా చట్టాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ కోరింది.

పొగాకు తినుడు బంజేయండి

కరోనా మహమ్మారితో పెరుగుతున్న ప్రమాద స్థాయిని దృష్టిలో ఉంచుకుని పొగాకు ఉత్పత్తులను తినడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం మానేయాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కరోనా ఎఫెక్టుతో తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, నాగాలాండ్, అస్సాం రాష్ట్రాలు పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ఇప్పటికే నిషేధించాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి.