
- జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్లకు లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో
- 868 అడుగులకు చేరుకున్న శ్రీశైలం రిజర్వాయర్
మహబూబ్నగర్/గద్వాల/నాగర్కర్నూల్, వెలుగు: కృష్ణా బేసిన్కు వరద పెరిగింది. మహారాష్ట్ర, కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి ప్రాజెక్టులకు పెద్దఎత్తున వరద చేరుతోంది. దీంతో గేట్లను ఎత్తడంతో దిగువన ఉన్న ప్రాజెక్టులకు లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో నమోదవుతోంది. ఈ సారి రుతుపవనాలు ముందే వచ్చినా రాష్ట్రంలో భారీ వర్షాలు పడలేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్ కింద ఉన్న ప్రియదర్శిని జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు మహారాష్ట్ర, కర్నాటక నుంచి వరద వస్తోంది. గత నెల 27 నుంచి జూరాలకు ఇన్ప్లో ప్రారంభమైంది.
అప్పటి వరకు జూరాలలో 3.2 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. మే 29 నాటికే 7.78 టీఎంసీలకు చేరుకుంది. అదే రోజు రాత్రి నుంచి లక్ష క్యూసెక్కుల ఇన్ప్లో వస్తుండడంతో ప్రాజెక్ట్ పది గేట్లను ఎత్తి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. అప్పటి వరకు శ్రీశైలంలో 39 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా.. క్రమంగా నిల్వలు పెరుగుతూ వచ్చాయి. ఇటీవల ఇన్ఫ్లో ఆగిపోయినా...తిరిగి మళ్లీ వర్షాలు పడుతుండడంతో జూరాలకు భారీమొత్తంలో వరద వస్తోంది.
134 టీఎంసీలకు చేరుకున్న శ్రీశైలం
మే 30 నుంచి శ్రీశైలం ప్రాజ్కెట్లోకి వరద రాక మొదలైంది. గత నెల 30న ప్రాజెక్ట్లో 39 టీఎంసీల నీరు ఉండగా.. శనివారం వరకు 134 టీఎంసీలకు చేరుకుంది. జూన్ 2 వరకు 80 వేల క్యూసెక్కుల నుంచి లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా.. తర్వాత భారీగా తగ్గిపోయింది. రెండు రోజుల నుంచి మళ్లీ లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 (215 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 868. 30 (134 టీఎంసీలు) అడుగుల మేర నీరు చేరింది. ఎగువ నుంచి 1.13 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది.
4.50 లక్షల ఎకరాలకు సాగునీరు
కేఎల్ఐ ప్రాజెక్ట్లోని మూడు ప్యాకేజీల కింద నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో సుమారు 4.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. 28వ ప్యాకేజీలో కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు వనపర్తి నియోజకవర్గంలో రెండు మండలాలు, దేవరకద్ర నియోజకవర్గంలో కొంత భాగం కవర్ అవుతుంది. 29వ ప్యాకేజీలో నాగర్ కర్నూల్, కల్వకుర్తి, నియోజకవర్గాలకు సాగునీరు అందుతుంది. ఇక 30వ ప్యాకేజీలో నాగర్ కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాలకు సాగునీరు అందుతోంది.
లిఫ్ట్లకు నీరు
జూరాల, శ్రీశైలానికి వరద వస్తుండడంతో వాటి పరిధిలో ఉన్న లిఫ్ట్లకు నీటిని తరలించే అవకాశం ఏర్పడింది. ఇప్పటివరకు జూరాల పరిధిలోని భీమా లిఫ్ట్-1, లిఫ్ట్-2, కోయిల్ సాగర్, లెఫ్ట్, రైట్ మెయిన్ కెనాల్స్, ఆర్డీఎస్ కెనాల్స్కు మాత్రమే నీటిని వదులుతున్నారు. జూరాల జల విద్యుత్ ఉత్పత్తికి కూడా నీటిని వినియోగిస్తున్నారు. అలాగే కల్వకుర్తి ఫస్ట్లిఫ్ట్ఎల్లూరులో ఐదు పంపులకుగానూ ప్రస్తుతం మూడింటి ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఎల్లూరు నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఇంజినీరింగ్ ఆఫీసర్లు రెడీగా ఉన్నారు.