
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ పట్టుదలను పొగడకుండా ఉండలేం. 2016 లో ఇంగ్లాండ్ పై చెన్నై వేదికగా ట్రిపుల్ సెంచరీ కొట్టి భారత క్రికెట్ తరపున ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. భారత్ తరపున టెస్టులో ట్రిపుల్ సెంచరీ ఒక్కసారిగా అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టు క్రికెట్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా సరికొత్త చరిత్ర నెలకొల్పాడు. చెన్నై వేదికగా జరిగిన ఈ టెస్టులో 381 బంతుల్లో 303 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
2017 లో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర ట్రోఫీలో స్థానం దక్కించుకున్న కరుణ్ విఫలమయ్యాడు. ఒక్క సిరీస్ లో విఫలమైనందుకే ఈ కర్ణాటక స్టార్ ను పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగించింది. కరుణ్ కు అన్యాయం జరిగిందని చాలామంది ఆరోపించారు. ఒక్క సారి భారత జట్టులో స్థానం కోల్పోతే తిరిగి ఎంట్రీ ఇవ్వడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరసం లేదు. కరుణ్ నాయర్ కూడా భారత జట్టులో చోటు సంపాదించడం కష్టమని అందరూ భావించారు. అయితే కరుణ్ నాయర్ భారత జట్టు తరపున ఆడాలనే తన ఆశను వదులుకోలేదు.
రంజీల్లో అద్భుతంగా ఆడడడంతో పాటు విజయ్ హజారే ట్రోఫీలో ఆరు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా 5 సెంచరీలు బాది టీమిండియా సెలక్టర్లకు సవాలు విసిరాడు. అతని అసాధారణ ఫామ్ కు భారత సెలక్టర్లు మరోసారి టెస్ట్ జట్టులోకి పిలుపునిచ్చారు. ఇంగ్లాండ్ తో భారత జట్టుకు ఎంపికయ్యే క్రమంలో కరుణ్ నాయర్ కు రిటైర్మెంట్ అవ్వాల్సిందిగా ఒక ప్రముఖ భారత క్రికెటర్ చెప్పాడట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
కరుణ్ నాయర్ మాట్లాడుతూ.. " భారత్ జట్టులో స్థానం కోల్పోయినప్పుడు నన్ను రిటైర్ అవ్వాల్సిందిగా ఒక ప్రముఖ క్రికెటర్ సూచించాడు. టీ20 లీగ్ లు ఆడడం ద్వారా లైఫ్ చాలా సురక్షితంగా ఉంటుందని సలహా ఇచ్చాడు. కానీ భారత జట్టులో స్థానాన్ని నేను అంత ఈజీగా వదులుకోవాలని భావించలేదు. డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. రెండు సంవత్సరాల్లోనే భారత జట్టులో స్థానంలో సంపాదించడం చెప్పలేని అనుభూతి". అని కరుణ్ నాయర్ చెప్పాడు.
8 ఏళ్ళ తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించిన కరుణ్ నాయర్.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో భారీ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి టెస్టుకు దాదాపు తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.