భూమి ద‌గ్గ‌రే ర‌క్షా బంధ‌న్ తో నిర‌స‌న‌

భూమి ద‌గ్గ‌రే ర‌క్షా బంధ‌న్ తో నిర‌స‌న‌

జగిత్యాల జిల్లా: బుగ్గారం మండల కేంద్రంలో తమకు ప్రభుత్వమిచ్చిన భూమిని.. పట్టణ ప్రకృతివనం పేరిట లాక్కోవటాన్ని తప్పుబడుతూ కొందరు పేదలు రెండు రోజుల క్రితం నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు వచ్చి ఎక్కడ తమ భూమిని ఆక్రమించుకుంటారోనన్న ఆందోళనతో... బాధిత వర్గం ఆదివారం రక్షాబంధన్ కార్యక్రమాన్ని కూడా భూమి దగ్గరే నిర్వహించుకుని నిరసన తెలిపారు.  తమకు 516 సర్వే నంబర్ లో ప్రభుత్వం భూములిస్తే అక్రమంగా లాక్కుని పట్టణ ప్రకృతివనం పేరిట చెట్లు నాటుతున్నారని వాపోయిన నగునూరి సంధ్య, నగునూరి జ్యోతి, నగునూరి శ్రావణి కుటుంబాలు.. తమ భూమిని తాము లేనప్పుడు ఎక్కడ లాక్కుంటారోనని అక్కడే రాఖీ పండుగను జరుపుతున్నారు. తమకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. తమనేదో ఒక కేసులో ఇరికేందుకు కుట్ర పూరిత ఆలోచనలు మీరెన్ని చేసినా.. చావడానికైనా సిద్ధమేగానీ... భూమిని మాత్రం వదులుకోమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులకు కనువిప్పు కల్గాలని ఆశిస్తున్నామన్నారు బాధితులు.