తనకంటూ సొంత ఐడెంటిటీ తెచ్చుకోవాలని చాలా తపన పడుతోంది జాన్వీ కపూర్. ‘గుంజన్ సక్సేనా’బయోపిక్ తన ఆశలు నెరవేరుస్తుందని నమ్మకం పెట్టుకుంది. అయితే అంతలోనే సుశాంత్ చనిపోవడంతో బాలీవుడ్ లో నెపోటిజం నిప్పు రాజుకుంది. బ్యాగ్రౌండ్ తో వచ్చిన వాళ్లందరినీ ప్రేక్షకులు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. వారిలో జాన్వీ కపూర్ కూడా ఉండటంతో ఇక ఆమె కెరీర్ అయిపోయినట్టే అనే కామెంట్స్ వచ్చాయి. దానికి తోడు నెపోటిజం ఇష్యూలో ముఖ్య పాత్రధారి అయిన కరణ్ జోహార్ ‘గుంజన్ సక్సేనా’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలనుకోవడం, టైటిల్ కార్డ్స్ నుంచి అతని పేరు కూడా మాయమైపోవడం వంటివి చూసి.. అతడిని మెంటర్గా పెట్టుకున్న జాన్వీకి కూడా కష్టా లు తప్పవన్నారు. అయితే ఆ నెగిటివిటీ మొత్తానికీ తన టాలెంట్తో ఫుల్స్టాప్ పెట్టేసింది జాన్వీ. మొదట వ్యతిరేకించిన వారు కూడా కార్గిల్ గాళ్ గా జాన్వీ పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయారు. మొట్ట మొదటి ఎయిర్ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ అద్భుతంగా నటించింది. థియేటర్స్లో రిలీజ్ కాలేదనే దిగులు కాస్తా ఇప్పుడొస్తున్న రెస్పాన్స్తో తొలగిపోయిందంటూ సంతోషపడుతోంది. బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన అవకాశాలు రావని, మొదట్లో ఆడిషన్కి వెళ్లిన తనని ఓ పెద్ద బ్యానర్ రిజెక్ట్ చేసిందని, ఇండస్ట్రీలో నిలబడాలంటే కష్టపడాలని చెబుతోంది జాన్వీ. ఆమె చెప్పింది నిజమంటూ కొందరు సపోర్ట్ చేస్తుంటే .. మిగతా వాళ్లతో కలిపి తనని కూడా పక్కన పెట్టేయకుండా ఉండేందుకే అలా చెప్పిందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా జాన్వీలో చాలా టాలెంట్ ఉందనేది మాత్రం ‘గుంజన్ సక్సేనా’ బయోపిక్ ప్రూవ్ చేసింది.