రెచ్చగొట్టిన చైనా.. దీటుగా బదులిచ్చిన ఇండియా

రెచ్చగొట్టిన చైనా.. దీటుగా బదులిచ్చిన ఇండియా

లడఖ్: లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి నెలకొన్న యథాతథ స్థితికి భంగం కలిగించేందుకు చైనా యత్నించింది. సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి ఇరు వర్గాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న సమయంలో డ్రాగన్ సైనిక కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించడం ద్వారా రెచ్చగొట్టే ధోరణిని మొదలుపెట్టింది. పాంగాంగ్ ట్సో్ సరస్సు దక్షిణ తీర ప్రాంతంలో యథాతథ స్థితికి ఆటంకం కలిగించేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చైనా దళాలు యత్నించాయని.. 29 నుంచి 30 వ తేదీల మధ్యరాత్రి ఈ ఘటన జరిగిందని ఇండియన్ ఆర్మీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. డ్రాగన్ దుశ్చర్యను దీటుగా తిప్పికొట్టామని పేర్కొంది. ఇండో చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ప్రతిష్ఠంభనను పరిష్కరించడానికి చూషుల్ లో ఇరు దేశాలు బ్రిగేడ్ కమాండర్ లెవర్ చర్చలు జరుపుతున్నాయి.

‘పాంగాంగ్ ట్సో నదీ తీరాల్లో యథాతథ స్థితికి భంగం కలిగించేందుకు యత్నించిన పీఎల్ఏను ఇండియా దళాలు అడ్డుకున్నాయి. మా స్థితిని బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నాం. అలాగే చైనా ఉద్దేశాన్ని అడ్డుకునేందుకు ముందుంటాం. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను కొనసాగించడంపై ఇండియన్ ఆర్మీ కట్టుబడి ఉంది. కానీ అదే సమయంలో తన భూభాగాపు సమగ్రతను కాపాడటంపై కూడా అంతే నిబద్ధతతో ఉంటుంది’ అని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ ఒక స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు.