సొంతూర్లలో దసరా పండుగను సంబురంగా చేసుకొని జనం మళ్లీ హైదరాబాద్ బాట పట్టారు. కార్లు, బైకులు, ఇతర వెహికల్స్లో బయల్దేరిన వారికి.. పోలీసుల తనిఖీలతో ఇబ్బందులు తలెత్తాయి. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన చెక్ పోస్టులతో కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. యాదాద్రి జిల్లా ఆలేరులో తనిఖీల కారణంగా 2 కిలోమీటర్ల మేర వెహికల్స్ నిలిచిపోయాయి. గూడూరు టోల్ ప్లాజా వద్ద వందలాది వాహనాలు జామ్ అయ్యాయి.
యాదాద్రి, వెలుగు: సద్దుల బతుకమ్మ, దసరా పండుగల కోసం హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లిన జనం తిరిగి పట్నానికి రిటన్ అయ్యారు. కార్లు, టూవీలర్స్ తదితర వేలాది వెహికల్స్లో మంగళవారం హైదరాబాద్ బాట పట్టారు. అయితే, ఎన్నికల కోసం స్టేట్ లెవల్లో అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.
సుమారు రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ తనిఖీలతో పండుగలకు కొన్ని రోజుల ముందు వరకు ఇబ్బందులు తలెత్తినా పబ్లిక్ సర్దుకున్నారు. కానీ, పండుగకు ముందు, తర్వాతి రోజుల్లో మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. రెగ్యులర్ వెహికల్స్కు తోడు పండుగ వెహికల్స్ రోడ్డెక్కడంతో వరంగల్ -- హైదరాబాద్, విజయవాడ -- హైదరాబాద్ హైవేలు రద్దీగా మారాయి. దీంతో హైవేలపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద పబ్లిక్కు చుక్కలు కన్పించాయి.
యాదాద్రి జిల్లా ఆలేరులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద చేసిన తనిఖీల కారణంగా దాదాపు రెండు కిలోమీటర్ల మేర వెహికల్స్ నిలిచిపోయాయి. ప్రతి కారును చెక్ చేసిన తర్వాతే పంపించడంతో పబ్లిక్అసహనానికి గురయ్యారు. ఒక్కో వెహికల్ దాదాపు గంటపాటు చెక్ పోస్ట్ పరిధిలో నిలిచిపోవాల్సి వచ్చింది.