ఆధార్ సెంటర్లకు పోటెత్తిన జనం.. ఉదయం నుంచే క్యూ లైన్లో

ఆధార్ సెంటర్లకు పోటెత్తిన జనం.. ఉదయం నుంచే క్యూ లైన్లో

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రజాపాలన ప్రారంభం కావడంతో  ఆరు గ్యారంటీల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు.  అయితే ఆధార్ అప్డేట్ కోసం మీ సేవా సెంటర్ల దగ్గర  జనం బారులు తీరుతున్నారు.  ఉదయం నుంచే క్యూ కట్టారు. కొన్ని ఆధార్ కార్డులు ఏపీ పేరుతో ఉండటం, జిల్లాల పేర్లు, మండలాల పేర్లు,అడ్రస్ మార్పులు, తప్పులు మార్చుకోవడం కోసం లైన్లలో నిలుచుంటున్నారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని పలు ఆధార్ సెంటర్ల ముందు ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ అప్డేట్ కోసం ఆధార్ సెంటర్ ముందు పలు గ్రామాల నుండి మహిళలు చిన్న పిల్లలతో కలిసి తెల్లవారుజాము నుండే బారులు తీరారు.  ఒక్కో రోజు సాయంత్రం వరకు లైన్లో నిలబడ్డా తమ వరకు రావడం లేదని జనం వాపోతున్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా ఆధార్ సెంటర్ల సంఖ్యను పెంచి తమ బాధలను తీర్చాలని వేడుకుంటున్నారు.
 
వరంగల్ జిల్లాలో   ఆధార్ నమోదు కేంద్రం వద్ద జనం క్యూ కట్టారు. ఆధార్ కార్డులలో చేర్పులు మార్పుల కోసం  దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం స్కీమ్స్ దరఖాస్తు చేసుకునేందుకు  ఆధార్ కార్డు కీలకం. కొత్త రేషన్ కార్డుల కోసం , మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణానికి ఆధార్ కార్డు అవసరం.. కావడంతో క్యూ కడుతున్నారు జనం.  చాలామందికి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి జిల్లాల పేర్లు ఉండటంతో  మార్చుకుంటున్నారు. ఉదయం తొమ్మిది గంటలకి టోకెన్లు  ఇస్తూ ఆధార్ కార్డు మార్పు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నారు.  పరిమిత సంఖ్యలో అవకాశం కల్పిస్తుండటంతో ఆధార్ కార్డు మార్పు కోసం మరో రోజు రావాల్సి వస్తోంది..