ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన తొలి ఇండియన్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ నిలిచాడు. కేవలం 67 బాల్స్లో 16 ఫోర్లు, 9 సిక్స్లతో 152 నాటౌట్గా నిలిచి విధ్వంసం సృష్టించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 264 స్కోర్చేసింది. కానీ ప్రత్యర్థి టీమ్అంతకు మించి ఆడింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (26 బాల్స్లో 76), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బాల్స్లో 71 నాటౌట్) చెలరేగి పోవడంతో కేవలం 18.5 ఓవర్లలోనే 265/4 స్కోరు చేసి గెలిచింది.
న్యూఢిల్లీ: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన తొలి ఇండియన్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ (67 బాల్స్లో 16 ఫోర్లు, 9 సిక్స్లతో 152 నాటౌట్) రన్రంగం సృష్టించినా.. ఢిల్లీ క్యాపిటల్స్కు ఓటమి తప్పలేదు. 265 రన్స్ లక్ష్యాన్ని కాపాడటంలో బౌలర్లు ఫెయిల్ కావడంతో.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో పంజాబ్ చేతిలో పరాజయం చవిచూసింది.
టాస్ నెగ్గిన ఢిల్లీ 20 ఓవర్లలో 264/2 స్కోరు చేసింది. నితీశ్ రాణా (44 బాల్స్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 91) మెరిశాడు. ఛేజింగ్లో పంజాబ్ 18.5 ఓవర్లలోనే 265/4 స్కోరు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (26 బాల్స్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 76), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బాల్స్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 71 నాటౌట్) రాణించారు. రాహుల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
రాహుల్ విధ్వంసం
ఫ్లాట్ పిచ్పై ఢిల్లీ ఓపెనర్ రాహుల్ పరుగుల సునామీ సృష్టించాడు. రెండు ఫోర్లు కొట్టి టచ్లోకి వచ్చిన మరో ఓపెనర్ పాథుమ్ నిశాంక (11)ను మూడో ఓవర్లో అర్ష్దీప్ (1/49) ఔట్ చేశాడు. కానీ ఈ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. వన్డౌన్లో వచ్చిన నితీశ్ రాణాతో కలిసి రాహుల్ పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశాడు. తొలుత రెండు ఫోర్లతో కుదురుకున్న రాహుల్ థర్డ్ ఓవర్లో సిక్స్తో జోరు పెంచాడు. తర్వాతి రెండు ఓవర్లలో నితీశ్ 4, 4, 4, 4 బాదితే రాహుల్ సిక్స్ కొట్టాడు.
ఆరో ఓవర్లో రాహుల్ ఫోర్తో పవర్ప్లేలో ఢిల్లీ 68/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్ విస్తరించిన తర్వాత స్పిన్నర్ చహల్ రాకతో మార్పు వస్తుందేమోనని భావించారు. కానీ రాహుల్ సిక్స్తో అతనికి స్వాగతం పలికాడు. 10వ ఓవర్లో రెండు రన్స్ తీసి 26 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రాహుల్ ఫోర్తో స్కోరును వంద దాటించాడు. ఇక ఇక్కడి నుంచి రాహుల్, నితీశ్ ఆట మరో మెట్టు ఎక్కింది.
11వ ఓవర్లో రాహుల్ రెండు ఫోర్లు కొడితే, 12వ ఓవర్లో నితీశ్ 6, 4, 4, 4, 6తో 28 రన్స్ దంచాడు. ఈ క్రమంలో 29 బాల్స్లో నితీశ్ ఫిఫ్టీ అందుకున్నాడు. ఆ తర్వాత రాహుల్.. స్టోయినిస్, అర్ష్దీప్ను లక్ష్యంగా చేసుకుని 6, 4, 6, 4, 4, 4తో 47 బాల్స్లోనే సెంచరీ బాదేశాడు. అదే జోరును కంటిన్యూ చేస్తూ 16వ ఓవర్లో 6, 6, 6, 4తో 24 రన్స్ రాబట్టాడు.
మధ్యలో నితీశ్ సింగిల్స్ తీస్తూ వీలైనప్పుడల్లా బౌండ్రీలు సాధించాడు. 18వ ఓవర్లో రాహుల్ 6, 4 దంచగా, 19వ ఓవర్లో నితీశ్ 6, 4 కొట్టి మూడో బాల్కు వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్కు 220 రన్స్ రికార్డు పార్ట్నర్షిప్కు బ్రేక్ పడింది. తర్వాత మిల్లర్ (3 నాటౌట్) మెల్లగా ఆడినా.. రాహుల్ బౌండ్రీతో 150 మార్క్ను దాటేశాడు.
పవర్ప్లేలోనే 116 రన్స్
భారీ ఛేజింగ్లో పంజాబ్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లపై వీరవిహారం చేశారు. తొలి ఓవర్లోనే చెరో సిక్స్తో ప్రియాన్షు ఆర్యా, ప్రభ్సిమ్రన్ ఛేదన మొదలుపెట్టారు. రెండో ఓవర్లో ప్రభ్ 6, 4, ప్రియాన్షు 6తో మరో మెట్టు ఎక్కించారు. మూడో ఓవర్లో ప్రియాన్షు 4, 6, 6, తర్వాతి ఓవర్లో ప్రభ్ 6, 6, 6, ప్రియాన్షు 6 దంచారు. ఆరో ఓవర్లో ప్రభ్సిమ్రన్ వరుసగా ఆరు ఫోర్లతో 24 రన్స్ రాబట్టాడు. దాంతో పవర్ప్లేలోనే పంజాబ్ 116/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది.
ఈ క్రమంలో ప్రభ్18 బాల్స్లో ఫిఫ్టీ అందుకున్నాడు. ఏడో ఓవర్లో ప్రభ్ రెండు ఫోర్లు కొట్టినా, ప్రియాన్షు ఔట్ కావడంతో తొలి వికెట్కు 126 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. 8వ ఓవర్లో ప్రభ్సిమ్రన్, 10వ ఓవర్లో కూపర్ కనోలి (17) ఔట్ కావడంతో పంజాబ్ 145/3తో నిలిచింది. ఈ దశలో వచ్చిన శ్రేయస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. నేహల్ వదేరా (25)తో కలిసి ఛేజింగ్ను సాఫీగా ముందుకు తీసుకెళ్లాడు.
విప్రజ్ నిగమ్ (1/24), కుల్దీప్ యాదవ్ (2/46)ను లక్ష్యంగా చేసుకుని ఫోర్లు, సిక్స్లు ఉతికేశాడు. 15వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి వదేరా వెనుదిరగడంతో నాలుగో వికెట్కు 56 రన్స్ జతయ్యాయి. 16వ ఓవర్లో శ్రేయస్ 6, 4, 6, 6తో 26 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. శశాంక్ సింగ్ (19 నాటౌట్) కూడా బ్యాట్ ఝుళిపించి ఐదో వికెట్కు 64 రన్స్ జోడించి మరో ఏడు బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు.
ఎంగిడికి గాయం
పంజాబ్తో మ్యాచ్లో ఢిల్లీ పేసర్ లుంగి ఎంగిడికి తీవ్ర గాయమైంది. అక్షర్ పటేల్ బౌలింగ్లో ప్రియాన్షు ఆర్యా కొట్టిన బాల్ మిడాఫ్లో గాల్లోకి లేచింది. దీన్ని అందుకునేందుకు వెనక్కి వెళ్లిన ఎంగిడి బ్యాలెన్స్ కోల్పోయి కిందపడ్డాడు. దాంతో తల నేలకు బలంగా తాకడంతో నొప్పితో విలవిల్లాడుతూ కదలకుండా ఉండిపోయాడు. ఫిజియోలు ప్రాథమిక చికిత్స అందించినా ప్రయోజనం లేకపోవడంతో గ్రౌండ్లోకి అంబులెన్స్ను పిలిచి హాస్పిటల్కు తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెడకు నెక్ బ్రేస్ అమర్చి జాగ్రత్తగా తీసుకెళ్లారు. ఈ ఘటనతో స్టేడియం మొత్తం సైలెంట్ అయ్యింది. తల, మెడ నొప్పికి చికిత్స తీసుకున్న అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
- మెన్స్ టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ రాహుల్ (152*). తిలక్ వర్మ (151), అభిషేక్ శర్మ (141) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
- ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన మూడో బ్యాటర్ కేఎల్ రాహుల్ (152*), క్రిస్ గేల్ (175*), మెకల్లమ్ (158*) ముందున్నారు.
- ఐపీఎల్లో అత్యధిక రన్స్ చేసిన ఐదో బ్యాటర్ రాహుల్ (5579). కోహ్లీ (8989), రోహిత్ (7183), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565) టాప్–4లో ఉన్నారు.
- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో బ్యాటర్ రాహుల్. కోహ్లీ (8), బట్లర్ (7), గేల్ (6) ముందున్నారు.

