‘నో ఫ్లై జోన్’ ప్రకటిస్తే.. యుద్ధంలోకి దిగినట్లే

‘నో ఫ్లై జోన్’ ప్రకటిస్తే.. యుద్ధంలోకి దిగినట్లే
  • రష్యాపై ఆంక్షలంటే.. యుద్ధం ప్రకటించడమే
  • ‘నో ఫ్లై జోన్’ ప్రకటిస్తే.. యుద్ధంలోకి దిగినట్లే: పుతిన్

మాస్కో, కీవ్: రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడం అంటే.. యుద్ధం ప్రకటించడం వంటిదేనని రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. ఉక్రెయిన్ లో ‘నో ఫ్లై జోన్’ను ప్రకటించడమన్నా.. యుద్ధంలోకి దిగినట్లేనని హెచ్చరించారు. శనివారం మాస్కోలో మీడియాతో పుతిన్ మాట్లాడారు. ఉక్రెయిన్ ను డీమిలిటరైజేషన్, డీనాజిఫికేషన్ చేయడం ద్వారా ఆ దేశాన్ని తటస్థంగా మార్చాలని, తద్వారా ఉక్రెయిన్ లోని రష్యన్ మాట్లాడే ప్రజలకు రక్షణ కల్పించాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మిలటరీ ఆపరేషన్ లో ప్రొఫెషనల్ సోల్జర్లు మాత్రమే పాల్గొంటున్నారని, ఇతర ఎలాంటి గ్రూపులూ పాల్గొనడంలేదన్నారు. అంతా అనుకున్న ప్రకారమే జరుగుతోందని, తాము లక్ష్యాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రష్యాలో మార్షల్ లా లేదా ఎమర్జెన్సీ విధిస్తారన్న వార్తలను పుతిన్ కొట్టిపారేశారు. అయితే, ఉక్రెయిన్​పై మిలిటరీ ఆపరేషన్ చేపట్టేందుకు పుతిన్ చేస్తున్న వాదనలు అర్థంలేనివని ఇదివరకే ఉక్రెయిన్, వెస్ట్రన్ కంట్రీస్ కొట్టిపారేశాయి. మరోవైపు ఉక్రెయిన్​లో నో ఫ్లై జోన్ ను ప్రకటించాలన్న జెలెన్ స్కీ వినతిని కూడా నాటో దేశాలు ఇదివరకే తిరస్కరించాయి.

5 గంటలు కాల్పులు ఆపి.. మళ్లీ దాడులు
భీకర యుద్ధంలో కొంచెం గ్యాప్ ఇచ్చింది రష్యా. ఉక్రెయిన్‌‌లోని మరియుపోల్‌‌, వోల్నోవాఖాలోని ప్రజలను సిటీల నుంచి బయటికి తరలించేందుకు తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పుకుంది. దీనికోసం హ్యూమన్ కారిడార్లను తెరుస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ శనివారం తెలిపింది. మాస్కో టైం ప్రకారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కాల్పులు జరపబోమని చెప్పింది. కానీ రష్యా తన మాట నిలబెట్టుకోలేదని, షెల్లింగ్‌‌ను నిరంతరం కొనసాగించిందని ఉక్రెయిన్ ఆఫీసర్లు ఆరోపించారు.

బాంబు దాడులు ఆగలే
కాల్పుల విరమణ సమయంలోనూ మరియుపోల్‌‌పై రష్యా బాంబు దాడులను కొనసాగించింది. దీంతో 2 లక్షల మందికిపైగా పౌరుల తరలింపు ప్లాన్‌‌ను ఉక్రెయిన్ క్యాన్సిల్ చేసుకుంది. ఇచ్చిన హామీని పుతిన్ బలగాలు ఉల్లంఘించాయని, ప్రజలు వెనుదిరగాలని సిటీ మేయర్ బోయ్‌‌చెన్కో కోరారు. ‘బాంబులు వేస్తూనే ఉన్నారు. ఆర్టిలరీని వాడుతూనే ఉన్నారు. మరియుపోల్ సిటీలో, సిటీకి వెళ్లే దారిలో కాల్పుల విరమణ అనేదే లేదు. షెల్లింగ్‌‌ మధ్య ప్రజలు ఎలా వెళ్లగలరు?’ అని డిప్యూటీ మేయర్ సెర్హీయ్ ఒర్లోవ్ ప్రశ్నించారు. కాల్పుల విరమణపై రష్యాతో చర్చలు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. అయితే రష్యా వాదన మరోలా ఉంది. మరియుపోల్, వోల్నోవాఖా దగ్గర్లో ఏర్పాటు చేసిన హ్యూమన్ కారిడార్లను ఎవరూ ఉపయోగించుకోలేదని రష్యా రక్షణ శాఖ చెప్పింది.