త్వరలో జెలెన్​ స్కీ, పుతిన్​ భేటీ!

త్వరలో జెలెన్​ స్కీ, పుతిన్​ భేటీ!
  • కీవ్​ నుంచి పోతం
  • బలగాలను తగ్గిస్తమన్న రష్యా
  • చెర్నిహివ్​ నుంచీ తప్పుకుంటం
  • శాంతి చర్చల తర్వాత ప్రకటన
  • నమ్మకం కలిగేందుకేనని వెల్లడి

ఇస్తాంబుల్, మాస్కో, కీవ్​: బాంబు దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్​లో శాంతి నెలకొల్పే దిశగా తొలి అడుగు పడింది. 34 రోజులుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు జరుగుతున్న చర్చలు ఫలితాలనిస్తున్నాయి. మంగళవారం జరిగిన చర్చల తర్వాత ఉక్రెయిన్​ రాజధాని కీవ్​తో పాటు చెర్నిహివ్​ నగరాల్లో దాడులు ఆపేస్తామని రష్యా ప్రకటించింది. అక్కడ మోహరించిన బలగాలను పెద్ద సంఖ్యలో వాపస్​ పిలిపించుకుంటామని తెలిపింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్​లో జరిగిన చర్చల తర్వాత రష్యా రక్షణశాఖ డిప్యూటీ మినిస్టర్ అలెగ్జాండర్​ ఫోమిన్​ ఈ మేరకు ప్రకటన చేశారు. చర్చలపై మరింత నమ్మకం పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని చెప్పారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చల సారాంశాన్ని ప్రెసిడెంట్​ పుతిన్​కు వివరించిన తర్వాత మిగిలిన వివరాలను మీడియాతో పంచుకుంటామని ఆయన తెలిపారు. మంగళవారం నాటి చర్చలు ఫలవంతంగా జరిగాయని చీఫ్​ నెగోషియేటర్​ వ్లాదిమిర్​ మెడిన్​స్కీ కూడా చెప్పారు. తాజా నిర్ణయంతో ఉక్రెయిన్, రష్యా ప్రెసిడెంట్లు నేరుగా కూర్చుని మాట్లాడుకునే రోజు దగ్గర్లోనే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జెలెన్​స్కీ, పుతిన్​ నేరుగా ముఖాముఖి మాట్లాడుకునేందుకు తగిన సందర్భం ఇదేనని ఉక్రెయిన్​ తరఫున చర్చల్లో పాల్గొంటున్న డేవిడ్​ అరఖామియా అన్నారు. నాటో కూటమిలో చేరబోమని, అణ్వస్త్రాలు తయారు చేయబోమని ఉక్రెయిన్​ చేసిన ప్రకటనలు ఇప్పుడు ఆచరణలోకి రాబోతున్నాయని రష్యా మంత్రి ఫోమిన్ ​చెప్పారు. ఈ క్రమంలోనే బలగాల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. మిగతా సిటీలల్లో మోహరించిన రష్యా బలగాల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

కోటి మంది వలస.. 20 వేల మంది మృతి

ఉక్రెయిన్​లోకి యుద్ధ ట్యాంకులను నడిపించాలంటూ పుతిన్​ ఆదేశించి నెలరోజులు దాటింది.. కీవ్​ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైనికులు మిసైళ్ల వర్షం కురిపించారు. రష్యా దాడుల నేపథ్యంలో దాదాపు కోటి మందికి పైగా ఉక్రెయిన్​ ప్రజలు తమ ఇల్లూవాకిలి వదిలి వలస వెళ్లిపోయారు. ప్రెసిడెంట్​ జెలెన్​స్కీ చెప్పిన వివరాల ప్రకారం.. 20 వేల మంది పౌరులు చనిపోయారు. నగరాలన్నీ శ్మశానాలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రష్యా చేసిన ప్రకటన ఉక్రెయిన్​ వాసులకు ఊరట కలిగించింది. యుద్ధం ఆగిపోతుందనే నమ్మకం కలుగుతోందని వాళ్లు అంటున్నారు. కాగా, రష్యా ప్రకటనపై బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాల ప్రెసిడెంట్లతో మాట్లాడతానని అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్​ చెప్పారు. మరోవైపు, రష్యా ప్రకటనతో యురప్​ స్టాక్​ మార్కెట్లు కొద్దిగా కోలుకున్నాయి. నూనె ధరలు ఐదు శాతానికి పైగా దిగొచ్చాయి. డాలర్​తో రూబుల్​ మారక విలువ 10 శాతం తగ్గింది.  

దాడులు ఇంకా ఆగలే..

ఓ వైపు ఇస్తాంబుల్​లో శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ ఉక్రెయిన్​ సిటీలపై దాడులను రష్యా ఆపలేదు. పోర్ట్​ సిటీ మికోలైవ్​లో రష్యా బలగాలు జరిపిన దాడిలో తమ పౌరులు ఏడుగురు చనిపోయారని ఉక్రెయిన్​ వెల్లడించింది. రష్యా బలగాల కంట్రోల్​ నుంచి మికోలైవ్, ఇర్పిన్​ నగరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. రష్యన్ల ఆధీనంలోని నగరాల నుంచి కూడా తమ పౌరులను తరలిస్తున్నట్లు వివరించింది. 

జెలెన్​స్కీ లెటర్​పై పుతిన్​ ఫైర్​

శాంతి నెలకొల్పేందుకు జెలెన్​స్కీ చేసిన ప్రతిపాదనలను పుతిన్​ కొట్టిపారేశారు. ​పుతిన్​కు జెలెన్​స్కీ స్వయంగా రాసిన లెటర్​ను రష్యన్​ బిజినెస్​మ్యాన్, శాంతి చర్చల మధ్యవర్తి రోమన్​ అబ్రామోవిచ్​ అందజేశారు. దీనిపై పుతిన్​ సీరియస్​గా స్పందించారని అబ్రామోవిచ్​ చెప్పారు. ఈమేరకు ‘ది టైమ్స్’ పత్రిక మంగళవారం ఓ కథనం ప్రచురించింది. జెలెన్ స్కీ లెటర్​ అందించిన తర్వాత ‘నేను వాళ్లను దెబ్బకొట్టగలనని అతడి(జెలెన్​స్కీ)కి చెప్పు’ అంటూ పుతిన్​ పేర్కొన్నట్లు వివరించారు. ఉక్రెయిన్​ న్యూట్రల్​గా ఉండాలన్న డిమాండ్​ను పరిశీలిస్తున్నామని జెలెన్​ స్కీ సోమవారం పేర్కొన్నారు. ఇదే విషయాన్ని లెటర్​ లో ప్రస్తావిస్తూ.. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ప్రాథమికంగా జరిగిన శాంతి చర్చల్లో అబ్రామోవిచ్​ పాల్గొన్నారని రష్యా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు రెండు దేశాల ప్రతినిధులే చర్చల్లో పాల్గొంటున్నారని వివరించింది.

శాంతి చర్చల్లో విష ప్రయోగం?

ఉక్రెయిన్​ తరఫున గతంలో రష్యాతో శాంతి చర్చల్లో పాల్గొన్న రష్యన్​ బిజినెస్​మ్యాన్ రోమన్​ అబ్రామోవిచ్ తో పాటు మరొకరిపై విషప్రయోగం జరిగిందని అధికార వర్గాల సమాచారం. ఈ నెల మొదట్లో జరిగిన శాంతి చర్చల సందర్భంగా ఒబ్రావిచ్​ అనారోగ్యం పాలయ్యారు. శాంతి చర్చల్లో సానుకూల ఫలితాలు రావొద్దనే ఉద్దేశంతో రష్యా తిరుగుబాటుదారులే ఈ పని చేసి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై అబ్రామోవిచ్​ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఇస్తాంబుల్​లో జరిగే శాంతి చర్చలకు ఉక్రెయిన్​జాగ్రత్తలు తీసుకుంది. మీటింగ్​లో ఎలాంటి ఆహార పదార్థాలు, డ్రింక్స్​ కానీ తీసుకోవద్దని తమ ప్రతినిధులను హెచ్చరించింది.