ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు ప్రతి డిపోలో ఎలాంటి టూర్ షెడ్యూల్ ఉండేదో అదే షెడ్యూల్ను దాదాపు శుక్రవారం నుంచి అమలు చేయనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. నాలుగు రోజులుగా ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు వివిధ వాహనాలను తిప్పి, ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చిచామని, అదే మాదిరిగా తిరుగు ప్రయాణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు.
అధిక చార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై పోలీస్ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇంఛార్జ్గా నియమిస్తున్నామని మంత్రి తెలిపారు. బస్సుల్లో డ్రైవర్ సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్ రూంల నెంబర్లు ఉన్నాయని, టికెట్ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి తెలిపారు.
ఈ నెల 14 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కానుండటంతో… షెడ్యూల్ ప్రకారం బస్సులను నడుపుతామని అన్నారు. అన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ బస్పాస్లను యదావిధిగా అనుమతించాలని ఆదేశాలిచ్చామన్నారు. విద్యార్థులు, వికలాంగులు,జర్నలిస్టు ఉద్యోగులు.. ఇలా అన్ని రకాల బస్పాసులన్నీ అనుమతించాలని, బస్పాస్లు అనుమతించడం లేదనే ఫిర్యాదు రావద్దని మంత్రి అధికారులకు తెలిపారు.
బుధవారం ఆర్టీసీ బస్సులు 3116, ఆర్టీసీ అద్దె బస్సులు 1933తో పాటు ప్రైవేట్ వాహనాలు తిరిగాయని పువ్వాడ అజయ్ అన్నారు. ఈ రెండు రోజులు ప్రయాణీకుల రద్దీని బట్టీ మరిన్ని వాహనాలను పెంచుతామన్నారు. రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలను పెంచారని, అన్ని శాఖల సహకారంతో సమ్మె ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నామని అజయ్ కుమార్ అన్నారు.