- బ్యాడ్మింటన్ ప్రిక్వార్టర్స్లో సింధు
- ఆర్చరీలో దీపికా ముందుకు..బాక్సింగ్లో పూజా సూపర్ పంచ్
- హాకీ, సెయిలింగ్, రోయింగ్లో తప్పని నిరాశ
టోక్యో ఒలింపిక్స్లో మెడల్ రాకుండా మరో రోజు గడిచిపోయినా.. ఆశలు పెట్టుకున్న అథ్లెట్లు మాత్రం పతకం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు..! గోల్డ్ మెడలే టార్గెట్గా బరిలోకి దిగిన తెలుగుతేజం పీవీ సింధు.. ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించగా, ఆర్చరీలో వరల్డ్ నంబర్వన్ దీపికా కుమారి గురి బాగా కుదిరింది..! అరంగేట్రం బాక్సర్ పూజా రాణి.. తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా సూపర్ పంచ్తో అదరగొట్టింది..! అంచనాలకు భిన్నంగా క్వార్టర్స్ చేరి ఔరా అనిపించింది..! మరొక్క బౌట్ గెలిస్తే కచ్చితంగా పతకం సాధిస్తుంది..! ఈ మూడు మెరుపులను పక్కనబెడితే.. బ్యాడ్మింటన్లో సాయిప్రణీత్, ఆర్చరీలో తరుణ్దీప్, ప్రవీణ్ జాదవ్, హాకీ, సెయిలింగ్, రోయింగ్లో మనకు నిరాశ తప్పలేదు..!!
టోక్యో: ఇండియా బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు.. టోక్యో ఒలింపిక్స్లో మరో అడుగు ముందుకేసింది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ గ్రూప్–జే మ్యాచ్లో ఆరోసీడ్ సింధు 21–9, 21–16తో ప్రపంచ 34వ ర్యాంకర్ఎన్గన్ చెయుంగ్యి (హంకాంగ్)పై గెలిచింది. దీంతో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన తెలుగమ్మాయి.. గ్రూప్ టాపర్గా ప్రిక్వార్టర్స్కు అర్హత సాధించింది. ప్రతి గ్రూప్లో టాపర్స్ మాత్రమే నాకౌట్ స్టేజ్కు క్వాలిఫై అవుతారు. చెయుంగ్తో మ్యాచ్లో సింధు పూర్తిగా ఆధిపత్యం చూపింది. దీంతో ఆమెపై ముఖాముఖి రికార్డును 6–0కు పెంచుకుంది. 35 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సింధు బలమైన గ్రౌండ్ స్ట్రోక్స్, లాంగ్ ర్యాలీస్తో ఆకట్టుకుంది. నెట్ వద్ద పర్ఫెక్ట్ ప్లేస్మెంట్స్ వేస్తూ ఈజీగా పాయింట్లు రాబట్టింది. 6–2 లీడ్తో తొలి గేమ్ను మొదలుపెట్టిన సింధు.. అద్భుతమైన ర్యాలీలతో 10–3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ దశలో ఓ తప్పిదం చేసినా.. వెంటనే తేరుకుని 11–5తో లీడ్ను సాధించింది. ఇక ఇక్కడి నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 15 నిమిషాల్లో గేమ్ను ముగించింది. రెండో గేమ్లో చెయుంగ్ క్రాస్ కోర్టు షాట్స్తో కాస్త పుంజుకుంది. దీంతో ర్యాలీస్ను కంట్రోల్ చేయడంలో సింధు కాస్త ఇబ్బందిపడింది. ఫలితంగా ఇద్దరి స్కోరు 8–8తో సమం అయ్యింది. ఈ దశలో సింధు జడ్జిమెంట్ ఎర్రర్ చేయడంతో చెయుంగ్ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. కానీ బెటర్ స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్న తెలుగమ్మాయి.. వరుస పాయింట్లతో 19–14 తోలీడ్లోకి వచ్చింది. ఈ దశలోనూ రెండు మ్యాచ్ పాయింట్లను చేజార్చుకున్న సింధు.. చివర్లో బలమైన స్మాష్తో గేమ్ను, మ్యాచ్ను సొంతం చేసుకుంది. ప్రిక్వార్టర్స్లో సింధు.. వరల్డ్ 12వ ర్యాంకర్ మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)తో తలపడుతుంది. మియాతో ఇప్పటిదాకా ఐదు మ్యాచ్ల్లో ఆడిన సింధు నాలుగు మ్యాచ్ల్లో గెలిచింది.
పతకానికి అడుగు దూరంలో..
ఫస్ట్ టైమ్ ఒలింపిక్స్కు క్వాలిఫై అయిన బాక్సర్ పూజా రాణి సంచలనం సృష్టించింది. విమెన్స్ 75 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్లో పూజ 5–0తో ఇచారక్ చైబ్ (అల్జీరియా)పై గెలిచి క్వార్టర్ఫైనల్లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్లో గెలిస్తే పూజకు కనీసం బ్రాంజ్ మెడలైనా దక్కుతుంది. ఏకపక్షంగా సాగిన బౌట్లో తనకంటే 10 ఏళ్లు జూనియర్ అయిన చైబ్పై ఇండియన్ బాక్సర్ పంచ్ల వర్షం కురిపించింది. దాంతో,చైబ్ రింగ్లో చాలాసార్లు అదుపు తప్పింది. ఫలితంగా పూజ రైట్ స్ట్రయిట్ హుక్స్తో విరుచుకుపడింది. దీంతో2014 ఆసియా గేమ్స్, లాస్ట్ ఇయర్ ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్లో చైబ్ చేతిలో ఎదురైన పరాజయానికి పూజ ప్రతీకారం తీర్చుకుంది.
దీపిక నవ్వింది..
భారీ ఆశలు పెట్టుకున్న ఆర్చరీలో ఇండియాకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వరల్డ్ నంబర్వన్ దీపికా కుమారి పతకం ఆశలు సజీవంగా నిలుపుకోగా, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ ఇంటిముఖం పట్టారు. మిక్స్డ్ ఈవెంట్లో ఫెయిలైన దీపిక ఇండివిడ్యువల్ పోరులో రాణించింది. ఫస్ట్ నాకౌట్ మ్యాచ్లో ఆమె 6–0తో కర్మా (భూటాన్)పై గెలిచింది. అయితే సెకండ్ మ్యాచ్లో మాత్రం ఇండియన్ ఆర్చర్కు.. 18 ఏళ్ల అమెరికా అమ్మాయి జెన్నిఫర్ ముసినో నుంచి ప్రతిఘటన ఎదురైంది. హోరాహోరీగా సాగిన ఈ రౌండ్లో దీపిక 6–4తో ముసినోపై ఉత్కంఠ విజయం సాధించింది. దీపిక ఓ దశలో 4–2తో లీడ్లోకి వచ్చినా అమెరికా ఆర్చర్ 4–4తో స్కోరు సమం చేసింది. కీలకమైన ఐదో సెట్లో మెరుగ్గా ఆడిన కుమారి మ్యాచ్ గెలిచి ప్రిక్వార్టర్స్కు అర్హత సాధించింది. మెన్స్ ఇండివిడ్యువల్ ఫస్ట్ రౌండ్లో తరుణ్దీప్ రాయ్ 6–4తో హున్బిన్ ఉలెక్సి (ఉక్రెయిన్)పై గెలిచాడు. కానీ తర్వాతి రౌండ్లో 5–6తో షాన్ని ఇటె (ఇజ్రాయిల్) చేతిలో ఓడాడు. మరో మ్యాచ్లో ప్రవీణ్ జాదవ్ 6–0తో వరల్డ్ నం.2 గాల్సాన్ బజారజాపోవ్ (ఆర్వోసీ)ను చిత్తు చేశాడు. కానీ, రెండో రౌండ్లో 0–6తో ఎలిసన్ బ్రాడీ (అమెరికా) చేతిలో ఓడి నాకౌటయ్యాడు.
సెయిలర్లకు లాస్ట్ ప్లేస్
ఇండియన్ సెయిలర్లు కె. గణపతి–వరుణ్ థక్కర్ జోడీ.. మెన్స్ స్కిఫ్ 49 ఈఆర్ ఈవెంట్లో నిరాశపర్చింది. బుధవారం జరిగిన మూడు రేసుల్లోనూ ఇండియన్స్ ఆకట్టుకోలేకపోయారు. వరుసగా 18, 17, 19వ ప్లేస్ల్లో నిలిచారు. మంగళవారం జరిగిన ఫస్ట్ రేస్లో ఈ ఇద్దరు 18వ ప్లేస్ సాధించారు. మరో ఎనిమిది రేస్లు, మెడల్ రౌండ్ మిగిలున్నాయి.
సాయిప్రణీత్ ఔట్
బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ గ్రూప్–డి మ్యాచ్లో 13వ సీడ్ సాయి ప్రణీత్ 14–21, 14–21తో మార్క్ కాలిజో (నెదర్లాండ్) చేతిలో ఓడాడు. దీంతో వరుసగా రెండో ఓటమితో గేమ్స్ నుంచి వైదొలిగాడు. 40 నిమిషాల పోరాటంలో సాయి ప్రభావం చూపలేకపోయాడు. ఈ గ్రూప్ నుంచి కాలిజో నాకౌట్కు క్వాలిఫై అయ్యాడు.
హాకీలో హ్యాట్రిక్ ఓటమి
మహిళల హాకీ టీమ్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో 1–4తో డిఫెండింగ్ చాంపియన్ గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓడింది. దీంతో క్వార్టర్స్కు క్వాలిఫై అయ్యే చాన్సెస్ మరింత సన్నగిల్లాయి. బ్రిటన్ తరఫున హన్హా మార్టిన్ (2, 19వ నిమిషం), లిలీ ఓస్లీ (41వ నిమిషం), గ్రేస్ బాల్సాడాన్ (57వ నిమిషం) గోల్స్ చేశారు. షర్మిలా దేవి (23వ నిమిషం) ఇండియాకు ఏకైక గోల్ అందించింది.
రోయర్లు సెమీస్తో సరి
రోయింగ్లో ఇండియాకు నిరాశ తప్పలేదు. మెన్స్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్లో అర్జున్ లాల్– అరవింద్ సింగ్.. ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయారు. సెకండ్ సెమీస్లో ఇండియన్ జోడీ 6:24.41 సెకన్ల టైమింగ్తో ఆరో ప్లేస్లో నిలిచారు. రెండు సెమీస్ల్లో టాప్–3లో నిలిచిన రోయర్లు ఫైనల్స్కు క్వాలిఫై అవుతారు. ఇప్పటికైతే ఒలింపిక్స్లో ఇండియన్ రోయర్లకు ఇది మంచి
పెర్ఫామెన్సే.