బషీర్ బాగ్, వెలుగు: బీసీని ముఖ్యమంత్రి చేస్తమని బీజేపీ ప్రకటించిందని, ఇది బీసీ ఉద్యమంలో తమ విజయమని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి ప్రధాని మోదీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన శనివారం బీసీ యువజన సమావేశం నిర్వహించారు. ఏ రాజకీయ పార్టీ అయితే బీసీ బిల్లుకు మద్దతు ప్రకటిస్తుందో వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఆ పార్టీకే అండగా ఉంటారన్నారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బెజవాడ ప్రణిత్ కు నియామక పత్రం అందజేశారు. నందగోపాల్, శివశంకర్, మట్ట జయంతిగౌడ్ పాల్గొన్నారు.