ఓబీసీ ఎంపీలను ఒకే తాటిపైకి తీసుకొస్తం: ఆర్.కృష్ణయ్య

ఓబీసీ ఎంపీలను ఒకే తాటిపైకి  తీసుకొస్తం: ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం బీసీల డిమాండ్లను నెరవేర్చాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్ల సాధనకు అన్ని రాజకీయ పార్టీలలోని ఓబీసీ ఎంపీలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతానని తెలిపారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో బీసీ గర్జనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జులైలో చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాచిగూడ లో గురువారం బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్​లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. తమ డిమాండ్ల సాధనకు ఈ నెల 25న ఏపీలోని విశాఖపట్నంలో బీసీ గర్జన నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. బీసీల డిమాండ్లను పరిష్కరించేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ , అధికార ప్రతినిధి కె.వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.