సినిమా బాగుంటే జనం చూస్తారు.. టికెట్ ధరలు పెంచితే ఫ్యాన్స్ కూడా చూడట్లేదు: ఆర్. నారాయణమూర్తి

సినిమా బాగుంటే జనం చూస్తారు.. టికెట్ ధరలు పెంచితే ఫ్యాన్స్ కూడా చూడట్లేదు: ఆర్. నారాయణమూర్తి

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న థియేటర్ల బంద్ అంశంపై స్పందించారు సీనియర్ నటుడు, డైరెక్టర్ ఆర్. నారాయణమూర్తి. ఈ అంశంపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు నారాయణమూర్తి. సినిమా టికెట్ ధరల పెంపు విషయంలోనూ ప్రేక్షకులు, సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. సినిమా బాగుంటే జనం తప్పకుండా చూస్తారని.. టికెట్ ధరలు పెంచడం వల్ల హీరోల అభిమానులే సినిమాలు చూడటంలేదని అన్నారు. 

చవకగా దొరికే వినోదం ఖరీదుగా మారిందని, భారీ ఖర్చుతో సినిమాలు తీయడం సబబే కానీ.. ఆ ఖర్చును ప్రజలపై రుద్దడం కరెక్ట్ కాదని అన్నారు నారాయణమూర్తి. హాలీవుడ్ లో ఎన్నో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారని.. మన దగ్గర షోలే, మోఘల్ ఏ ఆజాం లాంటి సినిమాలు వచ్చాయి కానీ.. వాటి కోసం ధరలు పెంచలేదని అన్నారు. మన తెలుగులో ఐదేళ్లు లవకుశ తీశారని, ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచమని అడగలేదని అన్నారు నారాయణమూర్తి. 

టాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ వ్యాఖ్యలు సమంజసం కాదని అన్నారు. ఇండస్ట్రీ కష్టాలపై మాట్లాడుకుందామని పిలిచి ఉంటే బాగుండేదని అన్నారు నారాయణమూర్తి. థియేటర్ల బంద్‌ అని ఎవరూ ప్రకటించలేదని.. బంద్‌ ప్రకటిస్తే మూడు వారాల ముందే నోటీసులు ఇస్తారని అన్నారు నారాయణమూర్తి. టికెట్ రేట్లు పెంచొద్దని కూడా చెప్పామని.. రేట్లు పెంచేస్తే సామాన్యులు థియేటర్లకు ఎలా వస్తారని అన్నారు.

సింగిల్‌ థియేటర్లకు పర్సంటేజ్‌ విధానం కావాలని.. అద్దె విధానం తొలగించాలని ఎప్పుడో డిమాండ్ చేశానని అన్నారు. పర్సంటేజ్‌ విధానానికి దిల్‌రాజు ఒప్పుకున్నారని అన్నారు నారాయణమూర్తి. సినీ పరిశ్రమను గౌరవించినందుకు సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని.. ఏపీలోనూ అవార్డులు ప్రకటించాలని కోరారు ఆర్‌.నారాయణమూర్తి. థియేటర్ల బంద్ అంశంపై నారాయణమూర్తి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.